
పనాజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మూడు జంటలు విజయం సాధించాయి. త్వరలోనే ఈ మూడు జంటలూ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాయి. గురువారం వెలువడిన ఫలితాల్లో మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీ రెండోసారి వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుత బీజేపీ సర్కారులోని హెల్త్ మినిస్టర్గా ఉన్న విశ్వజిత్ రాణె వాల్పోయి నియోజకవర్గం నుంచి, ఆయన భార్య దివియ పోరియం అసెంబ్లీ నుంచి సునాయాసంగా విజయం సాధించారు. పనాజి నియోజకవర్గం నుంచి అటనాసియో మోన్సెర్రాట్టె, తలేగా నుంచి ఆయన భార్య జెన్నీఫర్ కూడా బీజేపీ టికెట్పై గెలిచారు. కాలన్గుటె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి మైఖేల్ లోబో, సియోలిమ్ నియోజకవర్గం నుంచి ఆయన భార్య డెలీలా కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఇక, టీఎంసీ టికెట్పై పోటీ చేసిన కవితా కండోల్కర్, ఆమె భర్త కిరణ్ ఓటమిపాలయ్యారు. కాగా, బెనోలిమ్ నుంచి చర్చిల్ అలెమావో, నావెలిమ్ నుంచి బరిలోకి దిగిన ఆయన కూతురు వాలంక ఓడారు.