హైదరాబాద్, వెలుగు: దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ ను ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహిస్తున్నట్టు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ... నవంబర్ 25న నోవోటెల్లో నాలెడ్జ్ డే తో ఈవెంట్ ప్రారంభమవుతుందని అన్నారు. ఇందులో 1,500కి పైగా ప్రతినిధులు పాల్గొంటారు.
సస్టైనబుల్ ఫీడ్ సొల్యూషన్స్, ఆటోమేషన్, పౌల్ట్రీ వ్యాధులు, ఎరువుల నిర్వహణ, ఉద్యోగావకాశాలు వంటి ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు. ఈ ఎగ్జిబిషన్ కు 50 దేశాల నుంచి 500కిపైగా ఎగ్జిబిటర్స్, 40 వేలకుపైగా సందర్శకులు వస్తారని సింగ్ తెలిపారు.
ప్రస్తుతం భారతదేశం గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో, బ్రాయిలర్ మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉందని అన్నారు. మాంసం ఉత్పత్తి ఏటా 10 శాతం వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
