రెపోరేటు పెంపే కారణం
న్యూఢిల్లీ: ధరల భారాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) తన తాజా పాలసీ సమీక్షలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) పెంచడంతో బ్యాంకులూ వడ్డీరేట్లను పెంచుతున్నాయి. దీంతో రిటైల్, హోంలోన్లపై మరింత ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. హెచ్డీఎఫ్సీ, ఐసిఐసిఐ బ్యాంక్, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకులు తమ లోన్ రేట్లను పెంచాయి. రెపో రేటు ప్రకారం డిపాజిట్లు, లోన్లపై ఇవి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. రిటైల్ లోన్లపై ఇప్పుడు 7.95 శాతం వడ్డీ రేటు ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ఇది రెపో రేటు కంటే 2.55 శాతం ఎక్కువ. ఈ బ్యాంకు రిటైల్ లోన్లు రెపో రేటు ప్రకారమే ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఐఈబీఎల్ఆర్) కూడా రెపో రేటుకు లింక్ అయి ఉంటుంది. దీనిని 9.10 శాతానికి పెంచినట్టు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. కెనరా బ్యాంక్ తన రెపో రేట్-లింక్డ్ లెండింగ్ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీరేటు 8.30 శాతానికి పెరిగింది. కొత్త రేట్లు ఆగస్టు 7 నుండి అమలులోకి వచ్చాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్ రేట్లు (ఏడాది–మూడేళ్లు) 7.40 శాతం నుంచి 7.80 శాతం మధ్య ఉంటాయి. మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు గల లోన్ల రేట్లు 8.00–-8.40 శాతం వరకు ఉంటాయి. ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల లోపు వాటిపై 8.40–-8.80 శాతం వడ్డీ కట్టాలి. పది సంవత్సరాల నుండి 15 సంవత్సరాల కంటే తక్కువ గల లోన్ రేట్లు 8.90–-9.30 శాతం మధ్య ఉంటాయి. ఎంపీసీ తన పాలసీ రివ్యూలో శుక్రవారం (ఆగస్టు 5) రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల పెంచి 5.4 శాతానికి చేర్చింది. ఇది వరుసగా మూడవసారి పెరిగింది. తనఖా అప్పులు ఇచ్చే హెచ్డీఎఫ్సీ కూడా వడ్డీరేట్లను మరోసారి పెంచింది. ఈసారి వీటిని 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్టు ప్రకటించింది. ఫలితంగా కొత్త, పాత కస్టమర్లు హోం లోన్ల కిస్తీల భారం పెరుగుతుంది.