తెలంగాణలో కాంగ్రెస్​కు కాలం కలిసొచ్చిందా!

తెలంగాణలో కాంగ్రెస్​కు కాలం కలిసొచ్చిందా!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగింది. రాష్ట్రంలో బీఆర్‌‌ఎస్‌‌కు ఎదురే లేదు, కాంగ్రెస్‌‌ ఇక రాదు అని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు పరిస్థితులు ఒక్కసారిగా ‘నువ్వా-నేనా’ అన్నట్టుగా మారడంతో హ్యాట్రిక్‌‌ విజయంపై ధీమా పెట్టుకున్న బీఆర్‌‌ఎస్‌‌  ఆశలు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. పీపుల్స్‌‌ పల్స్‌‌ సంస్థ రాష్ట్రంలో నిర్వహించిన ఎగ్జిట్‌‌ పోల్‌‌ సర్వే ప్రకారం ఈ ఎన్నికలు బీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌ మధ్య కంటే బీఆర్‌‌ఎస్‌‌, ప్రజల మధ్యనే జరిగాయని చెప్పవచ్చు. రెండు మార్లు బీఆర్‌‌ఎస్‌‌కు అవకాశమిచ్చాం, ఇప్పుడు మార్పు కోరుకుంటున్నామని ఓటర్లు సర్వేలో చెప్పారు. కాంగ్రెస్‌‌కు ఆరు గ్యారెంటీల కంటే ప్రభుత్వ వ్యతిరేకతే కలిసివచ్చింది. కాంగ్రెస్‌‌కు అనుకూలంగా మరింత బలంగా గాలివీస్తే ఆ పార్టీకి మరిన్ని సీట్లు పెరిగే అవకాశాలున్నాయి.

రా   ష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పీపుల్స్‌‌ పల్స్‌‌ సంస్థ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న సమయంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్‌‌ఎస్‌‌పై వ్యతిరేకత ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. 2018 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత నెల నుంచే ప్రజలు కారుకు బ్రేకులు వేయడం మొదలుపెట్టారు. బీఆర్‌‌ఎస్‌‌ను దీటుగా ఎదుర్కొనే శక్తి ఉన్న పార్టీనే గెలిపిస్తూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ 46.9 శాతం ఓట్లతో 88 సీట్లను, కాంగ్రెస్‌‌ 28.4 శాతం ఓట్లతో 19 సీట్లను గెలుచుకున్నాయి. ఇంత భారీ విజయం సాధించిన తర్వాత కూడా కేసీఆర్‌‌ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోవడం ప్రజలకు నచ్చలేదు.2018 ఎన్నికల తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే వచ్చిన ఆదిలాబాద్‌‌, నిజామాబాద్‌‌, కరీంనగర్‌‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ నేత జీవన్‌‌రెడ్డిని గెలిపించారు. 

ఆరు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ‘కారు... సారు... పదహారు’ నినాదంతో ముందుకొచ్చిన బీఆర్‌‌ఎస్‌‌ 9, బీజేపీ 4, కాంగ్రెస్‌‌ 3 సీట్లు గెలుచుకున్నాయి. 2018 ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ సుమారు 19 శాతం ఓట్లు కోల్పోయింది.  నల్లగొండ, వరంగల్‌‌, ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కీలకనేత పల్లా రాజేశ్వర్‌‌ రెడ్డి అతికష్టంగా తీన్మార్‌‌ మల్లన్నపై గెలిచారు.  దుబ్బాక, హుజురాబాద్‌‌ ఉప ఎన్నికలతోపాటు జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లోనూ బీఆర్‌‌ఎస్‌‌కు భంగపాటే ఎదురయ్యింది. నాగార్జునసాగర్‌‌ ఉపఎన్నికలో గెలిచినా ఓట్ల శాతం మాత్రం పెరగలేదు. వామపక్షాల సహకారంతో మునుగోడు ఉపఎన్నికలో బీఆర్‌‌ఎస్‌‌ గెలిచి అనంతరం వారిని దూరం పెట్టారు.

సిట్టింగ్​లు అందరికీ టికెట్లు కొంపముంచింది

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 మంది సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా, కేసీఆర్‌‌ అతివిశ్వాసంతో రెండు నెలల ముందే దాదాపు సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వడం బీఆర్‌‌ఎస్‌‌కి నష్టం చేకూర్చే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. గ్రేటర్‌‌ ఎన్నికల్లో సిట్టింగ్‌‌ కార్పొరేటర్లకు తిరిగి టికెట్లు ఇచ్చి చేతులు కాల్చుకున్న కేసీఆర్‌‌ అదే పొరపాటును ప్రస్తుత ఎన్నికల్లోనూ చేస్తూ సిట్టింగ్‌‌లకే మళ్లీ టికెట్లు ఇచ్చారు.

డబుల్​ బెడ్​రూం​, దళిత బంధు సమస్యలు

డబుల్‌‌ బెడ్‌‌రూం ఇండ్లు, దళిత బంధు అందరికీ అందకపోవడం, బీసీ బంధు కొన్ని కులాలకే పరిమితం కావడం, నూతన రేషన్‌‌ కార్డులు ఇవ్వకపోవడం, నిరుద్యోగం, పంటకు కనీస మద్దతు ధర లభించకపోవడం, అవినీతి అంశాలు బీఆర్‌‌ఎస్‌‌కు వ్యతిరేకంగా ప్రభావితం చూపించాయి. డబుల్‌‌ బెడ్​రూం ఇండ్లు పూర్తిస్థాయిలో పంపిణీ కాకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత రెట్టింపయ్యింది. దళితబంధు అందరికీ ఇవ్వకపోవడం, ఇచ్చిన కొంతమందిలోనూ పార్టీ కార్యకర్తలే అధికంగా ఉండటం, వీటికి ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకున్నారని ఆరోపణలు బీఆర్‌‌ఎస్‌‌కు తీవ్ర నష్టం చేసినట్టు సర్వేలో వెల్లడయ్యింది. 

యువతలో ఆగ్రహం

 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్‌‌ పలు సందర్భాల్లో లెక్కలు చెప్పినప్పటికీ ఉద్యోగాలు రాలేదనే తీవ్ర అసంతృప్తి యువతలో నెలకొంది. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని గతంలో చెప్పిన కేసీఆర్‌‌ మాట తప్పడమే కాకుండా, టీఎస్పీఎస్సీ కుంభకోణంతో యువత ఆగ్రహం రెట్టింపయ్యింది. రాష్ట్రంలో 35 ఏళ్లలోపు ఉన్న 90 లక్షల యువ ఓటర్లలో అధిక శాతం బీఆర్‌‌ఎస్‌‌కు వ్యతిరేకంగా ఓటేసినట్టు సర్వేలో తేలింది. రైతుబంధు ఇస్తున్నప్పటికీ రైతు రుణమాఫీ జరగలేదనే అసంతృప్తి రైతుల్లో ఉంది. రైతు రుణాల వడ్డీలు రెట్టింపు కావడంతో రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్‌‌ వైపే రైతులు మొగ్గు చూపారు.

పార్టీకి, క్యాడర్​ మధ్య గ్యాప్​

 బీఆర్‌‌ఎస్‌‌ నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య గ్యాప్‌‌ ఏర్పడడం కూడా పార్టీకి నష్టం చేకూర్చిందని సర్వేలో వెల్లడయ్యింది. ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని అధినాయకత్వానికి భజన చేసే ‘బీటీ’ (బంగారు తెలంగాణ) టీమ్‌‌కు పార్టీలో ప్రాధాన్యత పెరిగిందనే భావన బీఆర్‌‌ఎస్‌‌లో ఏర్పడింది. కాంగ్రెస్‌‌లోని నేతలను  చేర్చుకొని ఆ పార్టీని బలహీనపర్చవచ్చని బీఆర్‌‌ఎస్‌‌ భావించింది. కానీ, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్‌‌  పార్టీ కేడర్‌‌ గురించి తక్కువ అంచనా వేసింది. మునుగోడులో విజయానికి బీఆర్‌‌ఎస్‌‌కు సాయపడిన కమ్యూనిస్టులతో సయోధ్యగా ఉండి ఉంటే, బీజేపీకి బీఆర్‌‌ఎస్‌‌ ‘బీ’ టీమ్‌‌ అనే మచ్చ వచ్చేది కాదు. ఈవిధంగా జరిగుంటే అసెంబ్లీ ఎన్నికల్లో లౌకికవాదులు కూడా పార్టీ పక్షానే ఉండేవారు.

అందుబాటులో లేని పాలన

కేసీఆర్‌‌.. మంత్రులకు, పార్టీ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరనే ప్రచారంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు క్షేత్రస్థాయిలో వినిపించాయి. వీరిని ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం చేశారనే విమర్శలు సర్వేలో వినిపించాయి. రోడ్లు, వీధిదీపాలు, పట్టణీకరణ పనులు తమను గెలిపిస్తాయని బీఆర్‌‌ఎస్‌‌ భావించగా, వీటిని అభివృద్ధి కోణం కంటే పార్టీ నేతల రియల్‌‌ ఎస్టేట్‌‌కే ఉపయోగపడ్డాయనే భావనతో ప్రజలు చూశారు.

నేతల సఖ్యత

కాంగ్రెస్‌‌ పార్టీలో అంతర్గత కలహాలుంటాయని భావనతో కేసీఆర్‌‌ పప్పులో కాలేశారు. ఆ పార్టీలో అరడజనుకుపైగా సీఎం అభ్యర్థులున్నారని, టికెట్లు రానివారు రెబల్స్‌‌గా పోటీ చేస్తారని ఈ పరిణామాలు  అనుకూలిస్తాయని కేసీఆర్‌‌ భావించగా, పది సంవత్సరాలకుపైగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌‌ నేతలకు జ్ఞానోదయమై అధికారమే లక్ష్యంగా అంతర్గత గొడవలను పక్కన పెట్టి పనిచేసినట్టు సర్వే సందర్భంగా కనిపించింది. రాహుల్‌‌ నిర్వహించిన భారత్‌‌ జోడో యాత్ర, కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో పెను మార్పులొచ్చాయి. భారత్‌‌ జోడో యాత్రకు ముందు తెలంగాణలో కాంగ్రెస్‌‌ మూడో స్థానంలో, బీజేపీ రెండో స్థానంలో ఉండేవి.  జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో, దుబ్బాక, హుజూరాబాద్‌‌ ఉపఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ బండి సంజయ్‌‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రతో పార్టీ గ్రామ స్థాయి వరకూ విస్తరించింది. ఒకానొక సమయంలో రాష్ట్రంలో బీజేపీని నిలువరించాలంటే కాంగ్రెస్‌‌కు బీఆర్‌‌ఎస్‌‌తో జట్టు కట్టాల్సిన అవసరం ఉందనే ప్రచారం కూడా జరిగింది. కానీ, కర్ణాటకలో కాంగ్రెస్‌‌ గెలుపు, మునుగోడులో బీజేపీ ఓటమితో రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‌‌ రోజురోజుకూ  పడిపోయింది.

బీజేపీ తప్పులు

 ఈ పరిణామాలతో తాము గెలవకున్నా ఫర్వాలేదు గానీ, దక్షిణాదిలో కాంగ్రెస్‌‌ బలపడకూడదనే ఉద్దేశంతో బీజేపీ తప్పుల మీద తప్పులు చేసింది. ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూనే  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్‌‌కు కలిసొచ్చాయి. వీటికి తోడు కర్ణాటకలో గెలుపు తెలంగాణ కాంగ్రెస్‌‌లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు రాష్ట్రంలో రెండో స్థానానికి ఎదగడానికి తోడ్పడ్డాయి. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌‌ పాలనపై ఏర్పడిన వ్యతిరేక ఓట్లు అధిక శాతం కాంగ్రెస్‌‌ ఖాతాలో జమ అయ్యాయని ఎగ్జిట్‌‌ పోల్‌‌ సర్వేలో తేలింది.   తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్టు ఉంది. ప్రధాని మోదీ ప్రకటించిన ఎస్సీ వర్గీకరణ, బీజేపీ బీసీ సీఎం ప్రభావం ఎన్నికల్లో చూపలేదని సర్వేలో తేలింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ గెలవబోతుందనే అంచనాకు వచ్చిన బీజేపీ అధిష్టానం చివరి దశలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి పరోక్షంగా బీఆర్‌‌ఎస్‌‌కు లబ్ధి చేకూర్చాలని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌‌ వైపు వీచిన గాలిలో ఇవన్నీ కొట్టుకుపోయాయని పీపుల్స్‌‌ పల్స్‌‌ సర్వేలో తేలింది.

పనిచేసిన గ్యారంటీలు

ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏదో జరుగుతుందని కలలు గన్న ప్రజల్లో ఆ లక్ష్యాలకు రాష్ట్రం చేరుకోలేదనే భావన పెరిగింది. గతంలో కాంగ్రెస్‌‌ని విడిచి బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌లో చేరిన అనేకమంది నాయకులు ఎన్నికల నాటికి తిరిగి కాంగ్రెస్‌‌లో చేరడం ఆ పార్టీకి మరింత కలిసి వచ్చింది. రెడ్డి సామాజికవర్గం కూడా కాంగ్రెస్‌‌ కోసం మునుపెన్నడూ లేని విధంగా పార్టీ విజయం కోసం కృషి చేసింది. వీటికి తోడు కేసీఆర్‌‌ భరోసా పథకాలను, కాంగ్రెస్‌‌ ఆరు గ్యారెంటీలు దీటుగా ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించడంలో ఈ గ్యారెంటీలు విజయం సాధించడంతో ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ గ్రాఫ్‌‌ రోజురోజుకూ పెరిగింది.

కాంగ్రెస్​ వైపు ఎస్సీ, ఎస్టీల మొగ్గు

సర్వేలో బీసీ సామాజిక వర్గంలో కాంగ్రెస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ పార్టీలకు సమాన మద్దతు లభించడం గమనార్హం. ఎస్సీ ఓటర్లలో, ఎస్టీ ఓటర్లలో కాంగ్రెస్‌‌ పార్టీకి ఆధిక్యత కనిపిస్తోంది. దళిత బంధు చాలామందికి అందకపోవడంతో పాటు పోడు భూముల పట్టాల పంపిణీ అసంపూర్తిగా మిగిలిపోవడమే దీనికి ప్రధాన కారణమని సర్వేలో తేలింది.15 శాతానికిపైగా ముస్లింలున్న నియోజకవర్గాలు రాష్ట్రంలో 24 ఉన్నాయి. ముస్లింలు ఎక్కువగా బీఆర్‌‌ఎస్‌‌వైపే నిలబడినా గత రెండు ఎన్నికలతో పోలిస్తే మాత్రం మద్దతు తగ్గిందని సర్వేలో తేలింది. కేంద్రంలో బీజేపీకి బీఆర్‌‌ఎస్‌‌, రాష్ట్రంలో బీఆర్‌‌ఎస్‌‌కు బీజేపీ పరోక్షంగా మద్దతిచ్చుకునేలా రెండు పార్టీలు అంతర్గత అవగాహనకు వచ్చాయని మైనార్టీలు భావించడమే దీనికి కారణం. ఎంఐఎం ప్రస్తుతమున్న ఏడు సీట్లను తిరిగి గెలిచే అవకాశాలున్నాయి. సీపీఐ, సీపీఐ(ఎం) ఉనికి కోసం పోరాడుతున్నాయి. తెలంగాణలో మొదటి నుంచి కమ్యూనిస్టులు, నక్సల్స్‌‌ ప్రభావం ఉండటం, టీజేఎస్‌‌, జాగో తెలంగాణ వంటి సంస్థలతో పాటు పలు ప్రజా సంఘాలు క్రియాశీలకంగా ఉండడంతో బీజేపీ ఆశించినట్టు ఉత్తరాది రాష్ట్రాల వలే హిందూ–ముస్లిం ప్రాతిపదికన ఎన్నికలు జరగలేదని సర్వేలో తేలింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్‌‌ వ్యూహాలు కూడా ఆ పార్టీ విజయానికి దోహదపడుతున్నాయని ఎగ్జిట్‌‌ పోల్‌‌ సర్వేలో వెల్లడైంది.

ఫామ్​హౌస్​ సీఎం

కేసీఆర్‌‌ ముచ్చటపడి కట్టించుకున్న నూతన సచివాలయానికి కూడా ఆయన రాకపోవడంతో కేసీఆర్‌‌కు ఫాంహౌస్‌‌ ముఖ్యమంత్రి అనే పేరు నిలిచిపోయింది. భారీ అంబేద్కర్‌‌ విగ్రహం, అమరవీరుల స్మారక కట్టడాలను కూడా ప్రజలు పట్టించుకోలేదు. తెలంగాణలో బాగుపడింది కేసీఆర్‌‌ కుటుంబం మాత్రమే అని ప్రతిపక్షాల ఆరోపణలు బీఆర్‌‌ఎస్‌‌కు నెగెటివ్‌‌గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్‌‌ ప్రభుత్వానికి ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజీ గండం ఇబ్బందులను రెట్టింపు చేసినట్లు సర్వే పరిశీలనలో తేలింది.

ఎదురే లేదనే  ధోరణి అనర్థమైంది

 ఇలా ప్రతి ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతున్నా కేసీఆర్‌‌ దిద్దుబాటుకు ప్రయత్నించకుండా తనకు ఎదురే లేదన్నట్టు వ్యవహరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో తమ ఎజెండా ఇంకా పూర్తి కాలేదని ‘గుడ్‌‌ టు గ్రేట్‌‌’ నినాదంతో బీఆర్‌‌ఎస్‌‌ ప్రచారం సాగించింది. మరోవైపు ఆశించినట్టుగా పీఆర్సీ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, సమ్మె చేసిన సమయంలో కేసీఆర్‌‌ చేసిన అవమానాన్ని మర్చిపోలేని ఆర్టీసీ కార్మికులు ‘ఇక చాలు... మార్పు కావాలి’ అని ఎన్నికలకు నాలుగైదు నెలల ముందే బీఆర్‌‌ఎస్‌‌కు వ్యతిరేకంగా సైలెంట్‌‌ ప్రచారం మొదలుపెట్టారు. 

- ఐ.వీ. మురళీకృష్ణ శర్మ,రీసెర్చర్​, పీపుల్స్​ పల్స్​ రీసెర్చ్​ సంస్థ