
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం ( సెప్టెంబర్ 25) శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై.. శ్రీకృష్ణడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.
చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతోపాటు .. తలపెట్టిన అన్నీ కార్యాలకు సిద్ధిఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఈ రోజు ( సెప్టెంబర్ 25) రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదించనున్నారు. వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు, సివిఎస్వో మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.