
3 అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న అధికార పార్టీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కి జరిగిన బైఎలక్షన్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. బెంగాల్లో మూడు, ఉత్తరాఖండ్లో ఒక అసెంబ్లీ స్థానానికి సోమవారం పోలింగ్ జరిగింది. ఫలితాలను గురువారం ప్రకటించారు. బెంగాల్లోని మూడు సీట్లలోనూ టీఎంసీ గెలిచింది. కలియాగంజ్,ఖరగ్పూర్ సదర్ , కరీంపూర్ నియోజకవర్గాల్లో తృణమూల్ సత్తాచాటింది. కరీంపూర్ సీటును నిలబెట్టుకోగా, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖరగ్పూర్ సదర్ , కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైనకలియాగంజ్ లో మమతా బెనర్జీ పార్టీ విజయం సాధించింది. టీఎంసీ గెలుపుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక కామెంట్స్ చేశారు. ఇది ‘ఎన్ఆర్సీ’ కి వ్యతిరేకంగా, సెక్యులరిజమ్, యూనిటీకి అనుకూలంగా ఓటర్లు ఇచ్చిన తీర్పని ఆమె అన్నారు. బీజేపీ ‘‘దురహంకారానికి’’ తగిన మూల్యం చెల్లించుకుందని విమర్శించారు. మరోవైపు, ఉత్తరాఖండ్ పితోర్ గఢ్ ఉప ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంది. పార్టీ కేండిడేట్ చంద్ర పంత్ ఈ స్థానం నుంచి గెలిచారు.