గొడవలు, మాట పట్టింపులు వచ్చినప్పుడు పార్ట్నర్ని పట్టించుకోరు. మాట్లాడరు. వాళ్ల వైపు చూడను కూడా చూడరు కొందరు. ఇలాంటప్పుడు ఇద్దరి మధ్య మౌనం అడ్డుగోడలా నిలుస్తుంది. దాంతో అవతలివాళ్లకి విసుగొస్తుంది. తమతో మాట్లాడడం లేదని మనసులో బాధపడుతుంటారు. ఈ సిచ్యుయేషన్ నుంచి బయటపడాలన్నా.. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండాలన్నా ఇద్దరూ మాట్లాడుకోవాలి. ఆగిపోయిన కమ్యూనికేషన్ని తిరిగి మొదలుపెట్టాలంటే అది మాటలతోనే సాధ్యమవుతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్.
కామ్గా ఉండాలి: మాట్లాడడం లేదని, పట్టించుకోవడం లేదని పార్ట్నర్ మీద కోపం పెంచుకోవద్దు. గట్టిగా అరవొద్దు. ప్రశాంతంగా ఉండాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. కొంచెం సేపు అటుఇటు నడవాలి. తర్వాత వాళ్లతో నిదానంగా మాట్లాడాలి.
కారణం తెలుసుకోవాలి: గొడవ జరగడానికి, అవతలివాళ్లే కారణం అనుకోవద్దు. ఇద్దరూ పొరపాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ‘నిజంగా నా తప్పు ఉందా? నా ప్రవర్తన సరిగా ఉందా?’ అని ఒకసారి ఆలోచించాలి. పార్ట్నర్ చెప్పేది వినకపోవడం, మాటల మధ్యలోనే కలుగజేసుకోవడం, వాళ్ల అలవాట్లు, ప్రవర్తనని తప్పుపట్టడం వంటివి రిలేషన్షిప్ని దెబ్బతీస్తాయి.
సూటిగా చెప్పాలి: చెప్పాలనుకున్న విషయాన్ని, సూటిగా అర్థమయ్యేలా పార్ట్నర్తో చెప్పాలి. అలాకాకుండా‘వాళ్లు అర్థం చేసుకుంటారులే’ అని పొడిపొడి మాటల్లో చెప్పొద్దు. స్పష్టంగా చెప్పకపోతే అవతలివాళ్లకు విషయం అర్థంకాక కన్ఫ్యూజన్లో పడతారు. దానివల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది.
గౌరవించాలి: పార్ట్నర్ తమను గౌరవించాలి అనుకుంటారు చాలామంది. అలాగే అవతలివాళ్లను కూడా గౌరవించడం, వాళ్ల మాటకు విలువ ఇవ్వడం ముఖ్యం అనేది గమనించాలి. పార్ట్నర్ సరిగ్గా మాట్లాడకపోతే.. వాళ్లంటే తమకు ఎంత ఇష్టమో చెప్పాలి. ఇద్దరూ సంతోషంగా గడిపిన రోజుల్ని గుర్తు చేసుకోవాలి.