- ఇందిరా పార్కు వద్ద నిరసనలకు అసోసియేషన్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీ బకాయిలు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ శనివారం ధర్నాకు పిలుపునిచ్చింది. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిరసన కార్యక్రమాలు చేపడతామని అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాకేశ్ తెలిపారు. 220 హాస్పిటళ్ల నుంచి డాక్టర్లు, సిబ్బంది సహా మొత్తం 1,500 మంది ధర్నాలో పాల్గొంటారని చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ బకాయిలు రూ.1,500 కోట్లకు చేరుకున్నాయని, ఇటీవల రూ.300 కోట్లు విడుదల చేశామని చెబుతున్న ప్రభుత్వం, ఏ ఆస్పత్రికి బకాయిలు చెల్లించారో చెప్పమంటే చెప్పడం లేదని ఆరోపించారు. ఇప్పటికే చాలా హాస్పిటళ్లు అప్పులతో ఇబ్బంది పడుతున్నాయని, ఈ నెల 15లోపు బకాయిలు పూర్తిగా చెల్లించకపోతే, 16 నుంచి సేవలు నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చారు.