బహుజన వీరుడు సర్వాయి పాపన్న

బహుజన వీరుడు సర్వాయి పాపన్న

మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్యస్థాపన చేసిన ఒక యోధుడి విజయగాథను చరిత్ర మరిచింది. రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దార్ల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడికి దక్కాల్సిన కీర్తి దక్కలేదు. సామాన్యుడు కావడం వల్లే ఆయన ప్రతిభ కాలగర్భంలో కలిసిపోతోంది. ఆయనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఖిలాషాపూర్​ కేంద్రంగా చేసుకుని మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఘనుడాయన. ఒక సామాన్యుడు ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుని రాజ్యాధినేతలనే ఎదిరించిన ఘనతను, గోల్కొండ కోటపై విజయబావుటా ఎగురవేసిన కీర్తిని, చరిత్ర పుటల్లో లిఖించడానికి మన వారికి చేతులు రాలేదు. పాపన్న ఆనవాళ్లుగా సజీవ సాక్ష్యంగా ఉన్న కోటలు, బురుజులు శిథిలమై పోతున్నా, వాటిని రక్షించే చర్యలేవీ లేవు. ఫూలే కంటే ముందు సామాజిక న్యాయం అమలు చేసిన పాపన్నకు సరైన గుర్తింపు రాలేదు. రాచరికపు ప్రభువుల వైభవాన్ని తప్ప, సామాన్యుడి పోరాటాన్ని చరిత్ర విస్మరిస్తుందనడానికి సర్వాయి పాపన్న చరిత్రే  సాక్ష్యం.
దళిత బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని మొట్టమొదటగా నిరూపించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఛత్రపతి శివాజీ ఉత్తర భారతంలో విదేశీయుల నుంచి దేశాన్ని కాపాడి సంప్రదాయ బూజు పట్టిన వ్యవస్థపై తిరుగు బావుటా ఎగురవేసి, స్వరాజ్యాన్ని సాధిస్తున్న సమయంలో, దక్షిణాదిన భూస్వామ్య, దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసి తెలంగాణ గడ్డపై దళిత, బహుజన, మైనార్టీలతో కలిసి ప్రజారాజ్యాన్ని నిర్మించిన వాడు పాపన్న. అందుకే మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సమకాలికుడిగా పాపన్నను చెబుతారు.
వరంగల్​ జిల్లా ఖిలాషాపూర్​ నుంచి..
కాకతీయుల పాలన ముగిసిన 300 ఏండ్ల తర్వాత 1650 నుంచి 1709 వరకు సర్దార్​ సర్వాయి పాపన్న ప్రస్థానం ఉన్నట్లు తెలుస్తోంది. పాపన్న 1650 ఆగస్ట్ 18న వరంగల్ జిల్లా ఖిలాషాపూర్ గ్రామంలో గౌడ కులంలో పుట్టారు. పాపన్న తండ్రి  చిన్నతనంలోనే చనిపోతే తల్లి సర్వమ్మ అన్నీ తానై పెంచింది. పాపన్న కల్లు గీత వృత్తి కొనసాగిస్తూ యుక్త వయసులోనే  భూస్వాములు, దేశముఖ్ ల దాష్టీకాలను సహించలేక, మూఢ సాంప్రదాయాలను ఎదిరించి పోరుబాట పట్టాడు. అగ్ర కులపెత్తనాన్ని అణచాలంటే ఒక్కరితో సాధ్యం కాదని గుర్తించి, మొత్తం బహుజన కులాలను ఏకం చేయాలనుకున్నాడు. తన స్నేహితులైన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీర్ సాహేబ్ తో కలిసి చుట్టూ జరుగుతున్న విషయాల గురించి చర్చించేవాడు. వాళ్లకు తన మార్గం, భవిష్యత్తు కార్యాచరణను వివరించి గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ధనవంతులు, జమీందారులపై రహస్య దాడులు చేసి కొల్లగొట్టిన ధనంతో మెరుగైన ఆయుధాలను సమకూర్చుకున్నాడు. దొరలు, భూస్వాముల వల్ల బాధలు పడుతున్న వారికి విముక్తి కలిగించి వారితో తన సైన్యాన్ని విస్తరించుకున్నాడు. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అగ్రకుల భూస్వాములు, ధనవంతుల గడీలు, కోటలపై దాడులు ప్రారంభించాడు. ప్రజల శ్రమను దోపిడీ చేసి కోటల్లో దాచుకున్న ఆస్తులను కొల్లగొట్టి పేద ప్రజలకు పంచిపెట్టి బందీలుగా మగ్గుతున్న అణగారిన వర్గాలను విడిపించాడు. ఈ నేపథ్యంలో పాపన్న సైన్యం అతి తక్కువ సమయంలోనే 12 వేలకు చేరింది. సైనిక శిక్షణ, యుద్ధ విద్యలను నేర్చుకోవడానికి పాపన్న వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు. శిక్షణ పొందిన సైన్యం ద్వారా చిన్న చిన్న సంస్థానాలు, గడీలపై మెరుపుదాడులు చేసి వాటిని ఆక్రమించుకుంటూ, తన సొంత ఊరు ఖిలాషాపూర్ ను రాజధానిగా చేసుకుని, 1675లో సర్వాయిపేట కేంద్రంగా తన రాజ్యాన్ని స్థాపించి దుర్భేద్యమైన కోట నిర్మించాడు.
అప్రతిహతంగా జైత్రయాత్ర
పాపన్న జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగి ఆ తర్వాత కరీంనగర్, హుస్నాబాద్, ఎలగందుల రాజ్యాలను జయించాడు. ఇలా రాజ్య విస్తరణ చేసుకుంటూ, తాటికొండలో నిర్మించిన కోట ద్వారా సైనిక కార్యకలాపాలను ఉధృతం చేసి వరంగల్, నల్గొండ జిల్లాల్లోని రాజ్యాలను గెలిచాడు. ఎత్తైన గుట్టలు ఉన్న ప్రాంతాలనే రక్షణ దుర్గాలుగా ఎంచుకున్నాడు. కనుచూపు మేరలో శత్రువు కదలికలను కనిపెట్టేలా కోటల నిర్మాణం చేశాడని, ఆధునిక ఆయుధాలు వాడినట్లు ఆ కోటలపై ఉన్న ఆనవాళ్లను బట్టి తెలుస్తోందని చరిత్రకారులు చెబుతున్నారు. పరాక్రమంలోనే కాదు, రాజనీతిలోనూ పాపన్న ఏ చక్రవర్తికీ తీసిపోడు. స్వయం సమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేశాడు. తాటికొండ లాంటి ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికై చెక్ డ్యామ్ లను కట్టించాడు. కులవృత్తులను ప్రోత్సహించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండలను అధీనంలోకి తెచ్చుకుని విజయ దుర్గాలను నిర్మించాడు. 1708 వరకు మొఘల్ ఏలుబడిలో ఉన్న ఓరుగల్లు, భువనగిరి కోటలను చేజిక్కించుకుని, భువనగిరి, వరంగల్, కొలనుపాక, జఫర్ ఘడ్, చేర్యాల్, బైరానుపల్లి, నల్గొండ, కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్ మొదలు మెదక్ జిల్లా పాపన్నపేట వరకు ఉన్న ప్రాంతాలను తన సామ్రాజ్యంగా చేసుకుని పాలించాడు. ఇలా సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి తన అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో 20 కోటలను నిర్మించాడు. 1700–1705 మధ్యకాలంలో ఖిలాషాపూర్​లో మరో దుర్గం నిర్మించాడు. యుద్ధ విద్యల్లో ఆరితేరిన సైన్యాన్ని సమకూర్చుకున్న పాపన్న ఖిలాషాపూర్​ కేంద్రంగా రాజ్యపాలన చేస్తుండటంతో ఈ ప్రాంతాల నుంచి రావలసిన పన్నులు తగ్గిపోవడంతోపాటు రాజ్యాలు ఒక్కొక్కటి చేజారుతుండటంతో అప్పటి ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబుకు కలవరం కలిగించింది. పాపన్నను బంధించాలని అప్పటి కొలనుపాక పాలకుడు రుస్తుందిల్ ఖాన్ ను ఆదేశించడంతో తన సైన్యాధినేత ఖాసింఖాన్ ను పాపన్నపై దాడికి పంపించాడు. ఖిలాషాపూర్​పై దాడికి వచ్చిన ఖాసింఖాన్​ను హతమార్చి అతడి సైన్యాలను పాపన్న తిప్పికొట్టాడు. కొంత కాలం తర్వాత ఏకంగా రుస్తుందిల్ ఖాన్ రంగంలోకి దిగి, పాపన్న సైన్యానికి పెద్ద ఎత్తున నష్టం చేసి, ఖిలాషాపూర్​ కోటను నేలమట్టం చేశాడని, అనంతర కాలంలో తిరిగి పాపన్న ఖిలాషాపూర్​ కోటను మరింత శత్రుదుర్భేద్యంగా మార్చాడు.
గోల్కొండ కోటపై బహుజనుల జెండా
ఔరంగజేబు మరణానంతరం దక్షిణాదిన మొఘల్ పాలన మరింత పట్టు తప్పడంతో, పాపన్న గోల్కొండ కోటపై దాడికి పథకం వేస్తున్న తరుణంలో, మొఘల్ రాజు బహదూర్ షా పాపన్నను స్వయం పాలకునిగా సంధికి ఆహ్వానించాడు. సంధికి వచ్చిన పాపన్నను ఎర్ర తివాచీ పరచి గౌరవంగా ఆదరించారని ఆంగ్ల చరిత్రకారుడు టీడబ్ల్యూ హేగ్ తన రచనల్లో పేర్కొన్నారు. కొంత కప్పం చెల్లించి గోల్కొండ కోటకు రాజుగా కొనసాగవచ్చని బహదూర్ షా చేసిన ప్రతిపాదనకు అంగీకరించిన పాపన్న, మొఘల్ చక్రవర్తి కోరిన కప్పాన్ని చెల్లించి గోల్కొండ కోటపై బహుజనుల జెండాను ఎగురవేశాడు. అయితే బహుజనుడైన పాపన్నను గోల్కొండ కోటకు రాజుగా చేయడాన్ని జమీందార్లు, దేశముఖ్ లు, జాగీర్దార్లు జీర్ణించుకోలేకపోయారు. పాపన్నను ఎలాగైనా రాజ్యాధికారం నుంచి తప్పించాలని కుట్రలు పన్నారు. మొఘల్ చక్రవర్తుల రాజ్య విస్తరణను అడ్డుకుని 30 ఏండ్లు తెలంగాణ గడ్డని పాలించిన పాపన్న విజయాలకు బెదిరిపోయిన సుభేదార్లు, మొఘల్ తొత్తులైన భూస్వాములు  కుట్ర పన్ని పాపన్న పరిపాలనలో తాము కొనసాగలేమని, ఆయనను పదవి నుంచి తప్పించాలని బహదూర్ షాను వేడుకోవడంతో, పాపన్నను బంధించి తేవాలని ఆయన సైన్యాన్ని ఆదేశించారు. దీంతో యూసఫ్ ఖాన్ రుజ్బహాని నాయకత్వంలో పెద్ద ఎత్తున మొఘల్ సైన్యం పాపన్నపై మూకుమ్మడిగా దాడికి దిగగా, ఇరు సైన్యాల మధ్య భీకర పోరులో పాపన్న తీవ్రంగా గాయపడి తప్పించుకున్నాడు. తనకు సురక్షిత ప్రాంతంగా భావించి హుస్నాబాద్ ప్రాంతానికి వచ్చి అక్కడ ఎల్లమ్మ గుడిని కట్టించి, రహస్యంగా కల్లు గీత కార్మికుడిగా జీవనం సాగించాడని చరిత్రకారులు చెపుతున్నారు. ఈ తరుణంలో ఒక ద్రోహి అందించిన సమాచారంతో మొఘల్ సైన్యం ఆయనను గుర్తించి బంధించడానికి ప్రయత్నించగా, శత్రువు చేతిలో మరణించడం ఇష్టం లేక పాపన్న ఆత్మహత్య చేసుకున్నాడని ప్రజల్లో ఒక కథనం ఉంది. మరో కథనం ప్రకారం 1709లో ఇరు సైన్యాల మధ్య జరిగిన పోరులో మొఘల్ సైన్యం ఆయనను బంధించి శిరచ్ఛేదనం చేసి తలను బహదూర్ షాకు కానుకగా ఢిల్లీకి పంపి, పాపన్న మొండాన్ని గోల్కొండ కోటకు వేలాడదీశారని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. వివిధ కథలు ప్రచారంలో ఉన్నా ఆయన ఒక యోధుడిగా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
కోటలను, కట్టడాలను పరిరక్షించాలి 
పాపన్న నిర్మించిన కోట గోడలపై చెట్లు పెరగడంతో పగుళ్లు వచ్చి కూలిపోతున్నాయి. ఎంతో స్ఫూర్తిదాయకమైన పోరాట నేపథ్యం కలిగిన పాపన్న ఖిలాషాపూర్ లో నిర్మించిన కోటగోడలు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు బీటలు వారి కుప్పకూలిపోయాయి. అయితే ఇటీవల ప్రభుత్వం తాత్కాలిక  మరమ్మతులు చేపట్టినా, పూర్తిస్థాయిలో కోటలు, కట్టడాలను పరిరక్షించేందుకు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. పాపన్న ధనవంతులు, జమీందార్ల గడీలు, కోటలపై దాడి చేసి స్వాధీన పరుచుకున్న సంపదను తాటికొండ, ఖిలాషాపూర్, సర్వాయిపేట కోటల్లోని రహస్య ప్రాంతాల్లో దాచి ఉంచాడని చరిత్రకారులు చెబుతారు. దీంతో గుప్త నిధుల వేటగాళ్లు నిధుల కోసం విలువైన కట్టడాలను తవ్వి వేయగా, కొంతమంది దొంగలు కోటల మీదున్న తోపులు, ఇతర ఆయుధాలను దొంగిలించుకుపోతున్నారు. ఇలా పీడిత వర్గాలకు చెందిన వీరుల చరిత్రలన్నీ కాల గర్భంలో కలిసి పోతున్నాయి.
పాపన్న చరిత్రకు పట్టాభిషేకం జరగాలి  
జమీందార్లు, దొరల అరాచకత్వంపై తిరుగుబాటు చేసి పీడిత వర్గాల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్వాయి పాపన్న చరిత్రకు పట్టాభిషేకం జరగాలి. ఉద్దేశపూర్వకంగా విస్మరణకు గురైన ఆయన చరిత్రను ప్రభుత్వం వెలికి తీసి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు అందించడమే కాకుండా, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వివిధ కథనాల నిగ్గు తేల్చాలి. పాపన్న కట్టిన కోటలు, బురుజులు, కట్టడాలను పరిరక్షించి, నాడు ఉపయోగించిన యుద్ధ సామగ్రి పరికరాల అవశేషాలను పురావస్తు శాఖ భద్రపరచాలి. పాపన్నకు గుర్తుగా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై, పాపన్న పాలన సాగించిన ప్రాంతాల్లో ప్రతిష్టించాలి. ఖిలాషాపూర్, తాటికొండ, సర్వాయిపేట కోటలను రక్షిత కట్టడాలుగా గుర్తించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తే.. రాబోయే తరాలకు పాపన్న ఘన చరిత్ర తెలియడమే కాకుండా, కళ్ల ముందే నాటి వైభవం కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడిన వాళ్లమవుతాం.
-----