
విప్లవ వీరుడు గద్దర్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న గద్దర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అభిమానుల సందర్శనార్థం కోసం గద్దర్ ప్రార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియానికి తరలించారు .ఆగస్టు 7 మధ్యాహ్నం 12 గంటల వరకు గద్దర్ పార్థివ దేహం ఎల్బీ స్టేడియంలో ఉంటుంది. అనంతరం అల్వాల్ లోని గద్దర ఇంటి దగ్గర స్థాపించిన మహోభోధి విద్యాలయం గ్రౌండ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.
ప్రజా యుద్ధ నౌక గద్దరన్న కి లాల్ సలాం: చిరంజీవి
గద్దర్ గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం. సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటల తో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది.
ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాల లో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు ,లక్షలాది ఆయన అభిమానులకు , శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం !
గద్దర్ విప్లవ శక్తి: బాలకృష్ణ
గద్దర్ మృతి పట్ల బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గద్దర్ ఓ విప్లవ శక్తి అని..ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లో గద్దర్ గుర్తుకొస్తారన్నారు. గద్దర్ లేని లోటు ఎవరూ తీర్చలేనిదని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు
ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ సజీవం: ఎన్టీఆర్
రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్పూర్థిని నింపిన ప్రజా గాయకుడు గద్దర్ మన మధ్యన లేకున్నా, ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటుంది. గద్దర్ కుటుంబ సభ్యులకు, కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.