హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ (మంగళవారం) టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈడీ ముందు హాజరయ్యారు. ఆ తర్వాత రోజుల్లో వరుసగా సినీ నటులు చార్మి, రకుల్ ప్రీత్సింగ్, రానా, రవితేజ, నవదీప్, ముమైత్ఖాన్, తనీష్, నందు, తరుణ్ను కూడా విచారించనుంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఆఫీసర్ శ్రీనివాస్ నుంచి ఈడీ సోమవారం కెల్విన్తో పాటు మరో ఏడుగురు నిందితుల వివరాలను తీసుకుంది. సిట్ విచారించిన 12 మంది సెలబ్రెటీలు సహా మొత్తం 50 మంది స్టేట్మెంట్స్ను కలెక్ట్ చేసింది. కెల్విన్ అరెస్ట్, సీజర్ డ్రగ్స్, చార్జ్షీట్ ఫైలింగ్ వరకు వివరాలను రికార్డ్ చేసింది.
సాక్షులుగానే విచారణ...!
సెలబ్రెటీల విచారణ కోసం సెప్టెంబర్ 22 వరకు ఈడీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంది. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో మంగళవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని ఎనిమిది మంది సభ్యుల టీం ప్రశ్నించనున్నట్లు తెలిసింది. తొలిరోజు సినీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ను విచారించనుంది. ఈ మేరకు విచారణకు రావాలని ఆయనను ఆదేశించింది. సెప్టెంబర్ 2న చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా, 9న రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్ రావు, 13న నవదీప్, 15న ముమైత్ఖాన్, 17న తనీష్, ఎఫ్ క్లబ్ మేనేజర్, 20న నందు, 22న తరుణ్ను విచారించేందుకు ఈడీ ఏర్పాట్లు చేసింది. వీళ్లందరినీ సాక్షులుగానే విచారించనున్నట్లు సమాచారం. 2017 జులై 2న నమోదైన డ్రగ్స్ కేసులో బెంగళూర్కు చెందిన కెల్విన్ ప్రధాన నిందితుడు. కెల్విన్తో పాటు డ్రగ్స్ స్మగ్లర్స్ కమింగా, పీటర్, పాతబస్తీకి చెందిన అబ్దుల్ వాహిద్, అబ్దుల్ ఖుద్దూస్ను సిట్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత డ్రగ్స్ సప్లయర్స్ నిఖిల్శెట్టి, అమన్ నాయుడు, కుందన్ సింగ్, అనీశ్, బ్రెండన్ బెన్ను అరెస్ట్ చేసింది.
కెల్విన్ గ్యాంగ్ హవాలా లింక్స్పై ఈడీ ఫోకస్
కెల్విన్ మొబైల్ ఫోన్లోని కోడ్ భాషను అప్పట్లోనే సిట్ డీకోడ్ చేసింది. సుమారు 2,143 కాంటాక్ట్స్ ట్రేస్ చేసింది. 30 వరకు వాట్సాప్ గ్రూపులు ఒక్కో గ్రూపులో 30 నుంచి 40 మంది మెంబర్స్ నంబర్స్ గుర్తించింది. కెల్విన్ గ్యాంగ్లోని ఏడుగురు నిందితుల బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ వివరాలను ఇటీవల సిట్ నుంచి ఈడీ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కు సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ను సేకరించినట్లు సమాచారం. డాక్యుమెంట్స్ ఆధారంగా డ్రగ్స్ కోసం మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయనేది.. హైదరాబాద్లో కెల్విన్ గ్యాంగ్ హవాలా లింక్స్ ఏమిటనే వివరాలను రాబట్టేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది.
కెల్విన్ గ్యాంగ్కుబాలీవుడ్తో సంబంధాలు
బాలీవుడ్ హీరో సుశాంత్ సూసైడ్ కేసులో ఈడీ దర్యాప్తు చేసింది. ఎన్సీబీ రిపోర్ట్ ఆధారంగా డ్రగ్స్ హవాలాను గుర్తించింది. బాలీవుడ్తోపాటు గోవా డ్రగ్స్ గ్యాంగ్స్తో కెల్విన్ గ్యాంగ్కు సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. బిట్ కాయిన్, డ్రగ్స్ దందాలో వేల కోట్లు విదేశాలకు హవాలా జరుగు తున్నట్లు గుర్తించింది. కెల్విన్ నెట్ వర్క్ సౌత్ ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రియా దేశాల నుంచి గోవా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ సహా మెట్రో సిటీస్కు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ముంబై, గోవాలో రిజిస్టరైన కేసుల్లో కెల్విన్ గ్యాంగ్ హవాలా, మనీల్యాండరింగ్ డేటాను ఈడీ కలెక్ట్ చేసింది.