కష్టాల్లో అభిమాని.. తానున్నానంటూ ఓదార్చిన బాలయ్య

కష్టాల్లో అభిమాని.. తానున్నానంటూ ఓదార్చిన బాలయ్య

కావలి: సినీ నటులకు మన దేశంలో చాలా క్రేజ్ ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌‌లో ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కథానాయకులకు ఫ్యాన్స్ బేస్ మామూలుగా ఉండదు. తమ అభిమాన హీరో సినిమా అప్‌‌డేట్స్, రియల్ లైఫ్ విశేషాలను తెలుసుకోవాలని వారు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణకు కూడా మంచి అభిమాన గణం ఉంది. మాస్ హీరోగా, పవర్‌‌ఫుల్ డైలాగులు, తనదైన వైవిధ్యభరితమైన నటన, డ్యాన్సులతో అభిమానులను బాలయ్య అలరిస్తూ ఉంటారు. తన ఫ్యాన్స్‌‌ను కూడా బాలయ్య అంతే బాగా ప్రేమిస్తుంటారు. తాజాగా జరిగిన ఓ ఘటన ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

నెల్లూరు జిల్లా, కావలి పట్టణానికి చెందిన నందమూరి బాలకృష్ణ వీరాభిమాని పత్తి మనోహర్. ప్రస్తుతం అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య.. తన ఆప్తుడు కోటంరెడ్డిని ఆ అభిమాని ఇంటికి వెళ్లి అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని ఆజ్ఞాపించారు. దీంతో సోమవారం కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పట్టణంలోని పత్తి మనోహర్ ఇంటికి వెళ్లి వారి సమస్యను తెలుసుకొని బాలయ్య బాబుకు ఫోన్ ద్వారా వివరించారు.

పత్తి మనోహర్‌‌కు ఫోన్ ఇవ్వమని బాలయ్య చెప్పగానే.. మనోహర్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నాడు. బాలయ్య ధైర్యాన్ని ఇస్తూ నువ్వు మళ్లీ మామూలు మనిషివి అవుతావంటూ భరోసానిచ్చారు. మన వాళ్లందరూ నీకు అండగా ఉంటారని ధైర్యాన్ని ఇచ్చారు. మనోహర్‌‌కు లివర్ ట్రాన్స్‌‌ప్లాంటేషన్ చేసేందుకు అవసరమైన సాయం అందిస్తామన్నారు. మనోహర్ తమ కుటుంబ సభ్యుడని, అతడ్ని కాపాడుకోవడం తన హక్కు అంటూ బాలయ్య తెలిపారు.