సెప్టెంబర్ 8న సినీ మహోత్సవం

సెప్టెంబర్ 8న సినీ మహోత్సవం

సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ.. ఇటు దర్శక నిర్మాతలకు, అటు నటీనటులకు చేదోడు వాదోడుగా ఉండే ప్రొడక్షన్ మేనేజర్స్.. తమ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుకను సెప్టెంబర్ 8న నిర్వహించబోతున్నారు. ‘సినీ మహోత్సవం.. రథసారథుల రజతోత్సవం’ పేరుతో హైదరా
బాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ  కార్యక్రమానికి సంబంధించిన కర్టెన్ రైజర్ ప్రెస్ మీట్ జరిగింది. ప్రొడక్షన్ మేనేజర్లంతా కలిసి నిర్వహిస్తున్న ఈ వేడుక విజయవంతమవ్వాలంటూ ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బిరామిరెడ్డి ఆకాంక్షించారు. ప్రొడ‌‌క్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియ‌‌న్ ప్రెసిడెంట్ అమ్మిరాజు మాట్లాడుతూ ‘ఈ వేడుకను సక్సెస్ చేసేందుకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.

మా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ‘చెన్నై నుంచి హైదరాబాద్‌‌కి తరలివచ్చే సమయంలో ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రొడక్షన్ మేనేజర్స్ ఎంతో సహకరించారు. అది మరువలేం. ఈ ఈవెంట్ పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను’ అని చెప్పారు. ‘మేనేజర్లు లేనిదే నేను లేను. వారంతా కలసి చేస్తున్న వేడుక విజయవంతం అవ్వాలి. అందుకు నటీనటులు సపోర్ట్ చేయాలి’ అని మా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తెలిపారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘సినిమాను ముందుండి నడిపించే మేనేజర్లు చేస్తున్న ఈ ఈవెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘మేనేజర్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్న వారి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది’ అన్నాడు సందీప్ కిషన్. సినీ మహోత్సవం పెద్ద సక్సెస్ అవ్వాలంటూ రెజీనా, ప్రగ్యా జైస్వాల్ శుభాకాంక్షలు తెలిపారు. నటీనటులు ఉత్తేజ్, రాజీవ్ కనకాల, హేమ, శివ బాలాజీ, రఘు, వెన్నెల కిషోర్, సంపూర్ణేష్ బాబు, నిర్మాతలు అశోక్, సి.కళ్యాణ్, ఎమ్.ఎల్.కుమార్ చౌదరి, దామోదర్ ప్రసాద్, దర్శకులు బాబి, బొమ్మరిల్లు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి