జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇవాళ( మంగళవారం) జరిగిన కాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన పాకిస్తాన్ ఉగ్రవాదిని భద్రతాదళాలు హతమార్చాయి. ఉగ్రవాది నుంచి ఓ AK47తుపాకీ, నాలుగు మేగజైన్లు, ఒక గ్రెనేడ్ తో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
నిఘా వర్గాలసమాచారంతో బెహ్రాంగాలా ప్రాంతంలో పోలీసులతో కలిసి సైన్యం గాలిస్తుండగా.. ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు యత్నించారు. అయితే భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో జరారా హతమయ్యాడని.. మరో తప్పించుకున్నట్లు ఓ డిఫెన్స్ అధికారి తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదిని పాక్ కు చెందిన అబు జరారాగా గుర్తించామని తెలిపారు. తప్పించుకున్న ఉగ్రవాదిని పట్టుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు.