
- కేరళలో ట్రావెల్స్ ఓనర్ నిర్ణయం
తిరువనంతపురం: కరోనా మహమ్మారి కేరళ టూరిజాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. వైరస్ భయంతో టూరిస్టులు రాకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు నష్టాలు భరించలేక బస్సులను అమ్ముకుంటున్నారు. కొచ్చికి చెందిన రాయ్ టూరిజం యాజమాని రాయ్సన్ జోసెఫ్ తన బస్సులను కిలో 45 రూపాయల చొప్పున తుక్కు కింద అమ్మేశాడు. తన దగ్గరున్న బస్సుల్లో 10 బస్సులను ఇలాగే తుక్కు కింద అమ్మేసినట్లు చెప్పాడు. కాంట్రాక్ట్ క్యారేజ్ అపరేటర్స్ అసోసియేషన్స్(సీసీవోఏ) స్టేట్ ప్రెసిడెంట్ బిను జాన్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా ట్రావెల్స్ యజమానులు భారీగా నష్టపోయారన్నారు. గత రెండు నెలల్లో వెయ్యికిపైగా బస్సులను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తీసుకెళ్లిపోయాయని చెప్పారు. రాష్ట్రంలో రోడ్ ట్యాక్స్ చాలా ఎక్కువగా ఉందని, ప్రతి టూరిస్ట్ బస్ అపరేటర్ ప్రతి 3 నెలలకోసారి రూ. 40 వేల ట్యాక్స్ కట్టాలన్నారు. డీజిల్ ధరలు కూడా పెరగడంతో బస్సులను తిప్పడం ఇంకింత కష్టమైందన్నారు. కరోనా రూల్స్ పూర్తిగాఎత్తేసేదాకైనా రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్లను విత్డ్రా చేసుకుంటే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరారు.