ఈ నగరాన్ని.. ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా.?

ఈ నగరాన్ని.. ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా.?

ఇటీవల మహిళలపై జరుగుతున్న ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు కామెంట్లు చేశారు. పోలీసు వాహనం ఎక్కి ఓ వ్యక్తి వీరంగం సృష్టిస్తోన్న వీడియోను షేర్ చేసిన ఆయన.. ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనేనని చెప్పుకొచ్చారు. ఆసిఫ్ నగర్ లో మందుబాబులు, పోలీసు వాహనం ఎక్కి వీరంగం చేసి, వాహనం అద్దాలు ధ్వంసం చేశారని  అన్నారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు. "ఈ నగరాన్ని, ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా? పౌర సమాజం ఆలోచన చెయ్యాలి" అని ఆయన కోరారు.

హైదరాబాద్‌ లోని అసిఫ్‌నగర్‌లో అర్థరాత్రి యువకులు వీరంగం సృష్టించారు. గంజాయి మత్తులో హల్ చల్ చేసిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. అప్పటికే మత్తులో ఉన్న ఆ యువకులు పోలీసు వాహనంపైకి ఎక్కి నానా హంగామా చేశారు. పోలీసు వాహనంతోపాటు ఇతర వాహనాల అద్దాలనూ పగులగొట్టారు. అనంతరం స్థానికుల సహాయంతో గంజాయి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో కొందరు తప్పించుకోగా.. అజయ్‌ అనే యవకుడిని అసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.