
- కార్మికుల హక్కులను కేంద్రం కాలరాస్తోంది
భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం/ములకలపల్లి, వెలుగు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తోందని కార్మిక సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. నాలుగు లేబర్ కోడ్లను అమలును అడ్డుకుంటామని, వెంటనే వాటిని విరమించుకోవాలన్నారు. ఈ విషయమై కొత్తగూడెం ఏరియా జీఎం ఆఫీస్ ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలంలో అమరవీరుల స్తూపం వద్ద నాయకులు నిరసన తెలిపారు. ములకలపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ గున్యాకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెట్టేందుకు బీజేపీ సర్కార్ పన్నుతున్న కుట్రలను కార్మికులంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలన్నారు. కొత్తగూడెంలో పట్టణ కన్వీనర్ బండారు శరత్బాబు, నాయకులు గడ్డం స్వామి, భూక్యా రమేశ్, గుడెల్లి యాకయ్య, రవి కుమార్, తాండ్ర విజయ్, ములకలపల్లిలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు నరాటి రమేశ్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ ధనలక్ష్మి పాల్గొన్నారు.