సిండికేట్ కావాలంటూ డ్రాలో వైన్స్ దక్కించుకున్నోళ్లకు హెచ్చరికలు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పది రోజుల కింద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసిన డ్రాలో వైన్స్దక్కించుకున్న వారి సంబురం అప్పుడే ఆవిరవుతోంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త లిక్కర్ షాప్లు ఓపెన్ కానుండడంతో సిండికేట్ కావాలంటూ పాత వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారు. కొత్తగా షాపులు దక్కించుకున్నవారికి ఎమ్మెల్యేలు, ఎక్సైజ్ ఆఫీసర్లతో ఫోన్లు చేయిస్తున్నారు. వినకపోతే తిప్పలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.
సిండికేట్ అయితే ఇబ్బందులుండవ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 88 షాపులుండగా, ప్రతి నెల రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్లకు పైగా లిక్కర్ బిజినెస్ సాగుతోంది. రెండు రోజుల్లో కొత్త షాపులు షురూ కానుండగా వైన్స్దక్కించుకున్న వారికి ఎక్సైజ్ శాఖ లైసెన్స్లు కూడా ఇష్యూ చేస్తోంది. డ్రాలో కొత్తవారికి ఎక్కువగా షాప్లు దక్కడం, పాత వారికి ఒకటీ రెండు రావడంతో ఆదాయం కోల్పోతామని భావిస్తున్నారు. గతంలో సిండికేట్గా ఉన్నప్పుడు బెల్ట్షాపులకు లిక్కర్ సప్లై చేస్తూ ఎక్స్ట్రా ఇన్కం పొందేవారు. వైన్స్ కాకుండా అదనంగా స్టోర్స్ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే బెల్ట్షాపులకు మద్యం తరలించేవారు. ఒక్కో బాటిల్పై రూ.15 వరకు ఎక్కువ తీసుకునేవారు. ఇప్పుడు సంపాదన తగ్గే అవకాశం ఉండడంతో కొత్తవారికి సిండికేట్ కావాలని సూచిస్తున్నారు. అయినా కొత్తగూడెం సర్కిల్తో పాటు ఇల్లెందు, పాల్వంచ, అశ్వారావుపేట, భద్రాచలం లాంటి ప్రాంతాల్లో కొత్తవారు వినడం లేదు. దీంతో ఎక్సైజ్ఆఫీసర్లతో, లోకల్ఎమ్మెల్యేలతో ఫోన్లు చేయిస్తున్నారు.
‘పాత వారితో ఎందుకు గొడవ. అందరూ సిండికేట్అయ్యి ఇబ్బందుల్లేకుండా బిజినెస్ చేసుకోండి. లేకపోతే మీకు ఇబ్బందులు తప్పవు’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. బెల్ట్ షాప్ల ద్వారానే ఎక్కువగా అమ్మకాలు సాగుతుండడంతో ఎక్సైజ్ఆఫీసర్లు కూడా పట్టించుకోవడం లేదు. అమ్మకాల టార్గెట్ రీచ్కావడమే తమ లక్ష్యమని, ఇవన్నీ చిన్న చిన్న విషయాలని ఆఫ్ది రికార్డుగా చెబుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని కొంతమంది లొంగిపోతుండగా, మరికొందరు షాపులు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. మరికొంతమంది సొంతంగా నే నడుపుకుంటామని ఖరాకండిగా చెబుతున్నారు. దీంతో వీరికి షాప్లు రెంట్కు దొరకకుండా చేస్తున్నారు. ఓనర్లతో మాట్లాడి రెంట్ఎక్కువ డిమాండ్ చేయాలని సూచిస్తున్నారు. రెంట్ఎక్కువైనా పర్వాలేదని తీసుకుంటుంటే ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్లు దొరకకుండా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.