
ముంబై: ఐపీఓ ముగిసిన తర్వాత లిస్టింగ్ మొదటి రోజున షేర్ల ట్రేడింగ్లో నమోదవుతున్న హెచ్చు–తగ్గులను గమనించిన సెబీ, ఇందుకోసం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. స్టాక్ ఎక్స్చేంజీలతో డిస్కషన్ తర్వాతే కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ఐపీఓ షేర్లకు కాల్ ఆక్షన్ సెషన్లు కొనసాగుతాయని, ఆయా ఎక్స్చేంజీలలో సెపరేట్గా వాటిని నిర్వహిస్తారని చెబుతూ, ఈక్విలిబ్రియం ప్రైస్ లెక్కించిన తర్వాత ఆయా ఎక్స్చేంజీలు ఆ ఆర్డర్లను మ్యాచ్ చేస్తాయని సెబీ తెలిపింది.
ఒకవేళ ఎక్స్చేంజీల మధ్య ఈక్విలిబ్రియం ప్రైస్లో తేడాలుంటే...అంటే ఆ షేర్లకు అనుమతించిన ప్రైస్ బ్యాండ్ కంటే ఎక్కువ శాతం తేడా ఉంటే...అప్పుడు ఎక్స్చేంజీలు కామన్ ఈక్విలిబ్రియం ప్రైస్ లెక్కకడతాయని సెబీ ఈ తాజా రూల్స్లో తెలిపింది. లిస్టింగ్ రోజున ఒక్కో ఎక్స్చేంజీలో కాల్ ఆక్షన్ సెషన్స్లో షేర్ల రేటు ఒక్కోలా ఉండటాన్ని గమనించిన సెబీ తాజా రూల్స్ తీసుకొచ్చింది. రెండు నెలల తర్వాత ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని పేర్కొంది.