
- 5 నెలలకే నొప్పులతో హాస్పిటల్కు గర్భిణి
- అందుబాటులో లేని డాక్టర్.. ఫోన్లో నర్సులతోనే వైద్యం
- ఆగ్రహించిన కుటుంబ సభ్యులు
- న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు ధర్నా
- దవాఖానాను సీజ్ చేసిన డీఎంహెచ్వో
- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. వాట్సప్ వీడియో కాల్ ద్వారా డాక్టర్ సూచనల మేరకు నర్సులు ఓ మహిళకు ట్రీట్మెంట్ చేశారు. దీంతో ఇద్దరు కవలలు చనిపోయారు. ఆగ్రహించిన బంధువులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేశ్ ముదిరాజ్, కీర్తికి ఏడేండ్ల కింద పెండ్లి అయింది. పిల్లలు పుట్టకపోవడంతో హైదరాబాద్ సిటీలోని ఒక దవాఖానాలో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా కీర్తి గర్బం దాల్చింది. 3 నెలలుగా ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్డులో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్ లో డాక్టర్ అనూషా రెడ్డి వద్ద చెకప్ చేయించుకుంటున్నది.
20 రోజుల కింద ట్రీట్మెంట్ కోసం కీర్తి హాస్పిటల్కు వచ్చింది. స్కానింగ్ చేసిన డాక్టర్.. కడుపులో కవలలు ఉన్నారని, ఎలాంటి పనులూ చేయొద్దని సలహా ఇచ్చింది. కడుపు దగ్గర కొన్ని కుట్లు వేసి పంపించేసింది. 5 నెలల గర్భిణి అయిన కీర్తికి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు డాక్టర్ అనూషా రెడ్డికి ఫోన్ చేశారు. ఓ ఇంజక్షన్ పేరు చెప్పి వెంటనే వేయించాలని సూచించింది. అయినప్పటికీ నొప్పులు తగ్గకపోవడంతో కీర్తిని కుటుంబ సభ్యులు విజయలక్ష్మి హాస్పిటల్కు తీసుకెళ్లారు. నొప్పులు తగ్గేందుకు ఇంజక్షన్ చేయాలని నర్సులకు డాక్టర్ సూచించింది.
ఇంజక్షన్ చేసినా నొప్పులు తగ్గలేదు. నర్సులతో ఆమె వాట్సప్ వీడియో కాల్ లో మాట్లాడుతూ వైద్యం అందించింది. ఉదయం 10.30 గంటలైనా డాక్టర్ హాస్పిటల్కు రాలేదు. వీడియో కాల్లో మాట్లాడుతూ.. నర్సులతోనే ట్రీట్మెంట్ చేయించింది. చివరికి ఇద్దరు మృత శిశువులు బయటికి వచ్చారు. 11 గంటలకు హాస్పిటల్కు వచ్చిన డాక్టర్ అనూషా రెడ్డి.. కవలలు చనిపోయారని, తల్లికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పింది. ఆ కవలలను ఆదివారమే కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారు. సోమవారం ఉదయం కీర్తిని డిశ్చార్జి చేసే టైమ్లో రూ.30వేలు కట్టాలని డాక్టర్ అనూషా రెడ్డి చెప్పింది.
దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు డాక్టర్తో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐవీఎఫ్కు సుమారు రూ.5 లక్షలు ఖర్చు పెట్టామని చెప్పారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే కవలలు చనిపోయారని ఫైర్ అయ్యారు. కవలలు చనిపోయేందుకు డాక్టర్ అనూషా రెడ్డినే కారణమంటూ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం సీఐ జగదీశ్ తెలిపారు.
తల్లి ప్రాణాలు కాపాడినం: డాక్టర్ అనూషా రెడ్డి
4 నెలల గర్భిణికి నొప్పులు రావడంతో హాస్పిటల్క వచ్చిందని డాక్టర్ అనూషా రెడ్డి మీడియాకు తెలిపారు. తీవ్ర రక్త స్రావం అవుతున్నదని సిస్టర్స్ చెప్పడంతో వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామన్నారు. వైద్యం అందించకపోయి ఉంటే తల్లి ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగేదని వివరించారు. తాను వచ్చి తల్లిని కాపాడేందుకు వైద్య సహాయం అందించానని వివరించారు. ట్రీట్మెంట్ పరంగా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదన్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం: డీఎంహెచ్వో
విజయలక్ష్మి హాస్పిటల్ను రంగారెడ్డి డీఎంహెచ్వో వెంకటేశ్వర రావు తనిఖీ చేశారు. ప్రాథమికంగా విచారణ జరిపిన ఆయన.. హాస్పిటల్ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగులను వనస్థలీపురం ఏరియా హాస్పిటల్కు తరలిస్తామన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.