ఒకే బైక్‌పై ముగ్గురు వెళ్తుండ‌గా ప్రమాదం.. ఇద్ద‌రు మృతి

ఒకే బైక్‌పై ముగ్గురు వెళ్తుండ‌గా ప్రమాదం.. ఇద్ద‌రు మృతి

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.గత రాత్రి జ‌రిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర దర్వాజ వద్ద ఒక ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువ‌కులు వేగంగా వెళుతుండగా ప్రమాద వ‌శాత్తు కింద పడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు స్వల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. స‌మాచారం అందిన వెంట‌నే సంఘటన స్థలానికి చేరుకున్న  మంగళహాట్ పోలీసులు గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని అతివేగ‌మే ప్ర‌మాదానికి అస‌లు కార‌ణ‌మ‌ని తెలిపారు. రోడ్డు ప్రమాదాల గూర్చి, అతి వేగం ప్ర‌యాణం ఎంతో ప్రమాదమ‌ని ఇటు పోలీసులు, ప్రభుత్వాలు అవగాహన కల్పించినా… యువత పెడచెవిన పెట్టి విలువైన ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంగళహాట్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు.