
తూర్పు లడఖ్ లో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న దేశ జవాన్లకోసం అధునాతన వసతి సదుపాయాలను ఏర్పాటు చేసింది ఇండియన్ ఆర్మీ. జవాన్ల కోసం బెడ్లు, ప్రత్యేక కబోర్డులతో పాటు గదుల్లో విద్యుత్, నీటి సరఫరా, హీటర్లు వంటి సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఆయుధాలు, ఇతర సైనిక సామగ్రి మంచుతో కప్పుకుపోకుండా ఉండేందుకు ప్రత్యేక షెల్టర్లను నిర్మించింది.
సముద్రమట్టానికి 17వేల అడుగుల ఎత్తులో ఉన్న లడఖ్ లో చలికాలంలో ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువకు పడిపోతాయి. నవంబరులో మైనస్ 30 నుంచి మైనస్ 40 డిగ్రీస్ వరకు ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఒక్కోసారి 40 అడుగుల వరకు మంచు పేరుకుపోతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జవాన్లు దేశ రక్షణ కోసం రాత్రి, పగలు తేడాలేకుండా పహారా కాస్తుంటారు. అలాంటి జవాన్ల కోసం సదుపాయాలను మెరుగుపరిచింది భారత సైన్యం. ఫ్రంట్లైన్లో విధులు నిర్వహించే బలగాల కోసం హీట్ టెంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.