నియంత పాలన పోవాలి.. హరీశ్‌‌రావు సీఎం కావాలి

నియంత పాలన పోవాలి.. హరీశ్‌‌రావు సీఎం కావాలి
  • జోగులాంబ ఆలయంలో 1,116 కొబ్బరికాయలు కొట్టిన టీఆర్‌‌ఎస్‌‌ నాయకుడు

రాష్ట్రంలో నియంత పాలన పోవాలని.. హరీశ్‌‌రావు  సీఎం కావాలని వనపర్తి జిల్లా చందాపూర్ టీఆర్‌‌ఎస్‌‌ నాయకులు గద్వాల జిల్లాలోని శక్తిపీఠం జోగులాంబ ఆలయంలో పూజలు నిర్వహించారు. చింతకుంట విష్ణు ఆధ్వర్యంలో మంగళవారం జోగులాంబ ఆలయంలో 1,116 టెంకాయలు కొట్టి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా టీఆర్‌‌ఎస్‌‌ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా హరీశ్‌‌రావుతో కలిసి తెలంగాణ కోసం అహర్నిశలు పోరాడానన్నారు. ఉద్యమ సమయంలో నిర్బంధం, ఎన్నో శిక్షలు అనుభవించామన్నారు. నేడు క్షేత్రస్థాయి ఉద్యమకారుల నుంచి హరీశ్‌‌రావు స్థాయి నేతల వరకు సీఎం కేసీఆర్ అణగదొక్కుతున్నారని ఆరోపించారు. తన కొడుకును సీఎం చేసేందుకు ప్రజల్లో అభిమానం ఉన్న హరీశ్‌‌రావు, ఈటల రాజేంద్ర, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య లాంటి నేతలను తెరమరుగు చేస్తున్నారని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, తెలంగాణ ఉద్యమ ద్రోహులను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కారన్నారు.