ధాన్యం కొనుగోళ్ళపై మరోసారి ఢిల్లీకి కేసీఆర్ బృందం

ధాన్యం కొనుగోళ్ళపై మరోసారి ఢిల్లీకి కేసీఆర్ బృందం

ఈ నెల 21న ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కానుంది. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కానున్నారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్. మీటింగ్ తర్వాత అదే రోజున ముఖ్యమంత్రి, మంత్రుల బృందం  ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. ధాన్యం కొనుగోళ్ళ మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభలో, రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు. పంజాబ్ కు చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్ సిఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు.