నకిరేకల్ (రామన్నపేట)సూర్యాపేట, వెలుగు: రాష్ట్రంలో విపక్షాలు చేపడుతున్న పాదయాత్రలకు అర్థం లేదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండల టీఆర్ఎస్ నూతన కమిటీ సభ్యులు శనివారం పదవీ బాధ్యతల స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. తెలంగాణ సమాజం మొత్తం సీఎం కేసీఆర్ వెంటే నడుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు మోకాలి మీద యాత్రలు చేసినా వారిని ప్రజలు నమ్మరన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నంబర్ వన్ స్థాయికి చేరుకుందని చెప్పారు. ప్రభుత్వంతో సమానంగా పార్టీ కమిటీ సభ్యులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులపైనే ఉందన్నారు.
అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు పాల్గొన్నారు. అలాగే సూర్యాపేటలో జరిగిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడారు. బాలసుబ్రహ్మణ్యం పాట మెడిసిన్ వంటిదన్నారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లలిత పాల్గొన్నారు.