మరోసారి టారిఫ్ల బాదుడు.. రాగి ఎగుమతులు, ఫార్మా ప్రొడక్టులపై భారీగా పెంచిన ట్రంప్

మరోసారి టారిఫ్ల బాదుడు.. రాగి ఎగుమతులు, ఫార్మా ప్రొడక్టులపై భారీగా పెంచిన ట్రంప్

న్యూఢిల్లీ: అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్​లు పెంచుతున్నట్టు ప్రకటించారు. దిగుమతి చేసుకునే రాగిపై 50శాతం టారిఫ్​,ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై 200శాతం వరకు టారిఫ్​ విధించనున్నట్లు హెచ్చరించారు. ఈ నిర్ణయం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపనుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. భారత్ అమెరికాకు రాగిని ఎగుమతి చేసే ముఖ్యమైన దేశాలలో ఒకటి. 

అయితే, ఈ 50శాతం టారిఫ్​ భారతదేశంలోని రాగి ఎగుమతిదారులపై భారం పడే అవకాశం ఉంది. అయినప్పటికీ, దేశీయంగా రాగికి బలమైన డిమాండ్ ఉన్నందున,   ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే రాగి 10 వేల టన్నులే కాబట్టి ఎఫెక్ట్​తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఫార్మా విషయంలో మాత్రం మనదేశ కంపెనీలకు ఇబ్బందులు ఏర్పడవచ్చని అంటున్నారు. 

భారత్​కు అమెరికా అతిపెద్ద ఫార్మా ఎగుమతి మార్కెట్. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే మొత్తం ఫార్మా ఉత్పత్తులలో 40శాతం వరకు అక్కడికే వెళ్తాయి. 200శాతం టారిఫ్​ అమలైతే, భారతీయ ఫార్మా పరిశ్రమకు ఇది భారీ దెబ్బ. ముఖ్యంగా, తక్కువ ధరల జనరిక్ మందులను సరఫరా చేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టారిఫ్​లు అమెరికాలో మందుల ధరలను పెంచే అవకాశం ఉంది. 

ఈ కొత్త టారిఫ్​లు భారతీయ ఎగుమతులను ప్రభావితం చేస్తాయి. సంబంధిత రంగాలలో ఆదాయ నష్టాలు ఉండవచ్చు. భారత ప్రభుత్వం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా ఈ సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. ట్రంప్​ నిర్ణయంతో భారత కంపెనీలు ఇతర మార్కెట్లవైపు చూసే అవకాశాలు ఉన్నాయి. మరింత పోటీతత్వాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించవచ్చని భావిస్తున్నారు.