
- నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలుసు.. తలుచుకుంటే చంపగలం.. ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదు
- ఇరాన్ సుప్రీం లీడర్కు ట్రంప్ వార్నింగ్
- టెహ్రాన్లో టెన్షన్.. సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న స్థానికులు
- -రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- ఇరాన్పై దాడి తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్
- ఎయిర్పోర్ట్పై అటాక్.. రెండు ఎఫ్-–14 ఫైటర్ జెట్లు ధ్వంసం
- ఐడీఎఫ్ దాడిలో ఖమేనీ ప్రధాన అనుచరుడు మృతి
- టెల్అవీవ్ లక్ష్యంగా ఇరాన్ కూడా ఎదురుదాడి
- 20 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం.. మొస్సాద్ ఆఫీస్ ధ్వంసం
వాషింగ్టన్ / టెల్అవీవ్: ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విషయంలో మొండిపట్టుదల వీడి సరెండర్ కావాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనిని హెచ్చరించారు. బేషరతుగా లొంగిపోయి అణ్వాయుధాలు తయారుచేయబోమని ఒప్పందం కుదుర్చుకోవాలని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ యుద్ధం ముగించాలంటే అణ్వాయుధాల గురించి మర్చిపోవాల్సిందేనన్నారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని, ఆయనను వెతికి మరీ చంపగలమని ట్రూత్ సోషల్లో ట్రంప్ పేర్కొన్నారు. ఖమేనీ మొండి వైఖరికి ఇరాన్ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని చెప్పారు. టెహ్రాన్ లో మరింత తీవ్ర దాడులు జరుగుతాయని, ఆ ప్రాంతాన్ని వదిలి దూరంగా వెళ్లిపోవాలని ఇరాన్ ప్రజలకు ట్రంప్ సూచించారు.
రణరంగంగా పశ్చిమాసియా..
పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఎయిర్స్ట్రైక్స్ చేస్తుండగా.. ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ మిసైల్స్ను ప్రయోగిస్తున్నది. కెనడాలో జరుగుతున్న జీ7 సమిట్లో పాల్గొన్న ట్రంప్.. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంపై ‘ట్రూత్’ వేదికగా స్పందించారు. అమెరికాతో ఇరాన్ న్యూక్లియర్ డీల్కు అంగీకరించి ఉండాల్సిందని అన్నారు.
‘‘ఇరాన్ న్యూక్లియర్ వెపన్ను తయారు చేయలేదు. ఇప్పటికే పదే పదే చెప్పా. అందరూ టెహ్రాన్ను ఖాళీ చేయాలి’’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమానికి నిజమైన ముగింపు ఉండాలని ట్రంప్ చెప్పడం.. యుద్ధ తీవ్రత ను మరింత పెంచింది. దీంతో 3 లక్షలకు పైగా టెహ్రాన్ వాసులు నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే టెహ్రాన్ డౌన్ టౌన్ ఖాళీ అవుతున్నట్లు వీడియోల్లో కనిపించింది.
ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ ఇరాన్
టెల్అవీవ్, జెరూసలెం లక్ష్యంగా ఇజ్రాయెల్పై మంగళవారం ఇరాన్ విరుచుకుపడింది. ఉత్తర ఇజ్రాయెల్పై మిసైల్స్ను ప్రయోగించిందని, భారీ శబ్దాలు వినిపించాయని ఐడీఎఫ్ తెలిపింది. బిల్డింగ్స్, వెహికల్స్పై క్షిపణులు పడడంతో మంటలు ఎగసిపడుతున్నట్లు తెలిపింది. కాగా, ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ సెంట్రల్ ఆఫీస్పై ఇరాన్ దాడి చేసింది. అత్యంత కచ్చితత్వంతో ఆ కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. గ్లిలాట్లోని ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్పైనా మిసైల్ ప్రయోగించినట్టు తెలిపింది.
ఇండియన్స్కు భారత ఎంబసీ అడ్వైజరీ
ఇరాన్లోని భారతీయ పౌరులకు ఇండియన్ ఎంబసీ తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) వెల్లడించింది. ‘‘టెహ్రాన్లోని ఇండియన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు (పీఐవో) అందరూ నగరాన్ని వీడండి. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని ఇండియన్స్ వెంటనే దౌత్యాధికారులతో టచ్లోకి రండి’’ అని అడ్వైజరీలో పేర్కొన్నట్టు ఎంఈఏ తెలిపింది. అలాగే, విదేశాంగ మంత్రిత్వ శాఖలో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు మరొక ప్రకటనలో తెలిపింది. హెల్స్లైన్ నంబర్లను పోస్ట్ చేసింది. ఇప్పటికే 110 మంది భారతీయ విద్యార్థులు ఇరాన్ను వీడి అర్మేనియాకు క్షేమంగా చేరుకున్నారని తెలిపింది. వీరంతా ప్రత్యేక విమానంలో బుధవారం ఢిల్లీకి చేరుకుంటారని ఎంఈఏ వెల్లడించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ సైనిక సలహాదారు మృతి
టెహ్రాన్పై ఇజ్రాయెల్ చేసిన అటాక్లో ఇరాన్ సీనియర్ మోస్ట్ మిలిటరీ అధికారి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సైనిక సలహాదారు అలీ షాద్మానీ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. సెంట్రల్ టెహ్రాన్లోని ఓ ప్రదేశంలో షాద్మానీ తల దాచుకున్నట్లు అందిన సమాచారంతో దాడి చేసినట్టు తెలిపాయి. ఇరాన్ చేస్తున్న పలు మిసైల్దాడులకు అలీ షాద్మానీ నేతృత్వం వహించారని పేర్కొన్నాయి.
ఇదివరకు షాద్మానీ అల్-అన్బియా అత్యవసర కమాండ్ సెంటర్ డిప్యూటీ కమాండర్గా, ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్గా విధులు నిర్వహించాడు. కాగా, టెహ్రాన్ ఎయిర్పోర్ట్పైన ఎయిర్ స్ట్రైక్స్ చేసి అక్కడున్న రెండు ఎఫ్-–14 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ విడుదల చేసింది. తమ విమానాలను అడ్డుకునేందుకు ఇరాన్ వీటిని ఎయిర్పోర్టులో సిద్ధంగా ఉంచిందని, వాటిని తాము నిర్మూలించామని, ఆ యుద్ధ విమానాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వెల్లడించింది.
‘‘ఇరాన్ సుప్రీం లీడర్ గా చెప్పుకుంటున్న ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు. అతనిని మేము చాలా ఈజీగా పట్టుకుంటాం. ప్రస్తుతానికి ఖమేనీని చంపే ఆలోచన మాకు లేదు. ఖమేనీని చంపితే మా వారిపై అటాక్ జరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి నాకు ఓపిక నశిస్తున్నది. వెంటనే ఖమేనీ బేషరతుగా లొంగిపోతే మంచిది. మా సహనాన్ని పరీక్షిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు”