- అధికారులకు రాష్ట్ర సర్కార్ ఆదేశం
- ఈ ఏడాది రూ.25,421 కోట్లు రాబట్టాలని అంచనా
- ఇప్పటి వరకు వచ్చింది రూ. 8,400 కోట్లే
- 4 నెలల్లో రూ.17 వేల కోట్లు కావాలని టార్గెట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల అమ్మకాన్ని సర్కార్ స్పీడప్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అనుకున్నంత ఆదాయం రాకపోవడంతో ప్రభుత్వ ల్యాండ్స్ సేల్స్తో పాటు భూములను సేకరించి, వాటిని అభివృద్ధి చేసి అమ్మడంపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. రేట్ల విషయంలో అటు ఇటు అయినా అమ్మేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే అమ్మకానికి గుర్తించిన భూములు, ఇతర ప్రాపర్టీల స్టేటస్ రిపోర్ట్ను అధికారులు ప్రభుత్వానికి అందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భూముల అమ్మకంతో రూ.25,421 కోట్లు సమకూర్చుకోవాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటి వరకు రూ.8,400 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకో 4 నెలల్లో ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుండగా, అనుకున్నంత ఆదాయం రాకపోవడంతో భూములను అమ్మడమే శరణ్యంగా ప్రభుత్వం భావిస్తోంది.
టార్గెట్ రూ.15 వేల కోట్లు
ఇప్పటికే గుర్తించిన భూములను అమ్మేందుకు రాష్ట్ర సర్కార్ ప్లాన్ సిద్ధం చేసుకున్నది. కోకాపేట, పుప్పాలగూడలో వచ్చిన విధంగా వేల కోట్ల ఆదాయం ఇతర ప్రాంతాల్లో రావడం లేదు. కొన్నిచోట్ల భూముల అమ్మకాలు జరుగుతలేవు. దీంతో రేటు అటు ఇటు అయినా అమ్మేయ్యాలని హెచ్ఎండీఏతో పాటు టీఎస్ఐఐసీ, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జిల్లాల్లో అసైన్డ్, ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ ల్యాండ్స్ పై అధికారులు రిపోర్ట్ రెడీ చేశారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో దాదాపు 5 వేల ఎకరాల భూములు గుర్తించారు. ఇందులో డెవలప్మెంట్ కింద 2,500 ఎకరాలు పూర్తి చేసి దాదాపు రూ.10 వేల కోట్ల పైన ఆదాయం రాబట్టుకోవాలని చూస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని నాలుగు జిల్లాల్లో వెయ్యి ఎకరాల వరకు అసైన్డ్ తదితర భూములు ఉన్నాయి. వీటిని అమ్మి మరో రూ.5 వేల కోట్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదంతా రెండు, మూడు నెలల్లో కంప్లీట్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
డెవలప్మెంట్ లే అవుట్లపైనే ఫోకస్
రాష్ట్రంలో అమ్మకానికి అనువైన 13 వేల ఎకరాల భూములను ఆఫీసర్లు గుర్తించారు. తాజాగా 50 ఎకరాలు ఆపైన ఒకే దగ్గర ఉన్న భూములను డెవలప్ చేసి అమ్మాలని నిర్ణయించారు. అసైన్డ్, ప్రభుత్వ భూములే కాకుండా.. రైతుల పట్టా భూములను సేకరించేందుకు కలెక్టర్లు, తహసీల్దార్లు నేరుగా రైతులతో మాట్లాడుతున్నారు. రోడ్డుకు దగ్గరలో ఉన్న భూములే టార్గెట్గా ప్రభుత్వం పనిచేస్తుండడంతో కొందరు రైతులు వెనకడుగు వేస్తున్నారు. గుట్టలు ఉన్న ప్రాంతాల్లో ఇచ్చేందుకు సిద్ధమవుతున్నప్పటికీ అక్కడ డెవపల్మెంట్ ఖర్చు ఎక్కువ అవుతుండటంతో సర్కార్ వెనకడుగు వేస్తోంది. భూములను లేఅవుట్లుగా మార్చాక వాటిలో ఎకరాకు 600 చదరపు గజాలు ఇవ్వాలని ఓనర్లు కోరుతున్నారు. డిమాండ్ ఎక్కువ ఉన్నచోట్ల ఇంకా ఎక్కువే అడుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం తక్కువ విస్తీర్ణం ప్రపోజల్స్ వస్తున్నాయి. దీంతో ఎటూ కుదరక ఇప్పటికే 4 చోట్ల లే అవుట్కు సంబంధించిన డెవలప్మెంట్ఆగిపోయినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.
ఈ ఏడాదిలో రూ.8,400 కోట్ల ఆదాయం
భూముల అమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.8,400 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. నాన్ ట్యాక్స్ ఇన్కం వివరాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. అనుకున్న దాంట్లో 8 నెలలకు 33 శాతమే వచ్చింది. మరో 4 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దళితబంధు, రైతుబంధు వంటి ఇతర సంక్షేమ పథకాల అమలుకు నిధుల కటకట వెంటాడుతోంది. ఈ రెండు నెలల్లో భూముల అమ్మకం చేపడితే.. వచ్చే ఏడాది మార్చి నాటికి స్కీంలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది.