ఎలక్షన్లు  పెట్టరు.. కమిటీలు పనిచేయవు

ఎలక్షన్లు  పెట్టరు.. కమిటీలు పనిచేయవు
  •     ముగిసిన ఎంప్లాయీస్​ వెల్ఫేర్​ బోర్డుల కాలపరిమితి
  •     కమిటీల పనితీరుపై  కార్మికుల్లో అసంతృప్తి
  •     బాధ్యతల నుంచి తప్పుకుంటున్న మెంబర్లు
  •     ఎన్నికలు నిర్వహించాలని యూనియన్ల డిమాండ్

మంచిర్యాల, వెలుగు: టీఎస్​ ఆర్టీసీలో గుర్తింపు యూనియన్లను రద్దు చేస్తూ వాటి స్థానంలో ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్​ వెల్ఫేర్​ బోర్డు కమిటీల కాలపరిమితి డిసెంబర్​ ఒకటో తేదీతో ముగిసింది. మళ్లా కొత్త బోర్డులను నియమిస్తారా? ప్రస్తుత కమిటీలనే కొనసాగిస్తారా? లేక ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న అంశాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. సీఎం కేసీఆర్​ పెట్టిన గడువు ముగిసినందున వెంటనే గుర్తింపు యూనియన్​ ఎలక్షన్లు నిర్వహించాలని కార్మిక సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. 

ముగిసిన కమిటీల గడువు 
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో సర్కారు మొండివైఖరికి నిరసనగా 2019 అక్టోబర్​ 4 అర్ధరాత్రి నుంచి కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. యాభై రోజులకు పైగా సమ్మె చేసి, నవంబర్​ 25న విరమించాయి. ఆర్టీసీ దుస్థితికి యూనియన్ల తీరే కారణమన్న సీఎం కేసీఆర్​ రెండేండ్ల పాటు గుర్తింపు సంఘం ఎన్నికలను నిషేధించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్​ వెల్ఫేర్​ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి డిపోలో డీఎం ఆధ్వర్యంలో నలుగురు ఆఫీసర్లు, కండక్టర్,​ డ్రైవర్​ మొత్తం ఏడుగురు మెంబర్లతో కమిటీలను నియమించారు. ఇందులో యూనియన్​ లీడర్లకు చోటివ్వలేదు. కమిటీల్లో ఆఫీసర్లదే మెజారిటీ కావడంతో కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని, కండక్టర్​, డ్రైవర్​ మెంబర్లుగా ఉన్నప్పటికీ వారి అభిప్రాయాలను, సలహాలు, సూచనలను గౌరవించడం లేదని విమర్శలు వస్తున్నాయి. వెల్ఫేర్​ బోర్డుల పనితీరుపై కార్మికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మెంబర్లు తమ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. కమిటీల కాలపరిమితి ముగిసిందని, అనారోగ్య కారణాలు చూపుతూ మెంబర్​షిప్​ను రద్దు చేయాలని కోరుతున్నారు.   

ఎలక్షన్లు నిర్వహించాలి  
ఆర్టీసీలో ఎంప్లాయీస్​ వెల్ఫేర్​ బోర్డ్​ కమిటీల గడువు ముగిసినందున గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. ఆర్టీసీలో 11 యూనియన్లు ఉండగా, టీఎంయూ మినహా మిగతా పది సంఘాలు జూన్​లో జేఏసీగా ఏర్పడ్డాయి. గుర్తింపు యూనియన్​ ఎలక్షన్లు నిర్వహించాలని డిమాండ్​ చేస్తున్నాయి. కమిటీల గడువు ముగిసిన విషయాన్ని గుర్తుచేస్తూ ఎంప్లాయీస్​ యూనియన్​ (ఈయూ) ఇటీవల సీఎం కేసీఆర్​కు లెటర్​ రాసింది. 2018లో జరగాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాయిదా వేసిందని పేర్కొంది. సీఎం కేసీఆర్​ పెట్టిన రెండేండ్ల డెడ్​లైన్​ ముగిసినందున వెంటనే ఎలక్షన్లు నిర్వహించాలని డిమాండ్​ చేసింది. సర్కారు స్పందించకపోవడంతో జనవరిలో పోరాట కార్యాచరణ ప్రకటించడానికి ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతోంది.

ఇంకా లేట్​ చేయొద్దు
ఆర్టీసీలో గుర్తింపు యూనియన్లను రద్దు చేసి ఎంప్లాయీస్​ వెల్ఫేర్​ కమిటీలను ఏర్పాటు చేసి రెండేండ్లు అయ్యింది. సమస్యలు పరిష్కారం కాక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కేసీఆర్​ పెట్టిన గడువు డిసెంబర్​ ఒకటితో ముగిసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలక్షన్లు నిర్వహించాలె. ​ - బీవీ.రావు, ఈయూ రీజినల్​ సెక్రటరీ, ఆదిలాబాద్ 

కార్మికులు ఇబ్బంది పడుతున్రు
ఆర్టీసీ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నరు. గతంలో యూనియన్లు సమస్యలపై పోరాడి పరిష్కరించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎంప్లాయీస్​ వెల్ఫేర్​ కమిటీలు ఉన్నా లేనట్టే అయ్యింది. రోజురోజుకు పనిభారం, సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి గుర్తింపు ఎన్నికలే పరిష్కారం.    
- కేఎస్​.రావు, టీఎంయూ డిపో సెక్రటరీ, మంచిర్యాల