సెక్యూరిటీ కోసం ట్విట్టర్లో ఈ–మెయిల్ గాని, ఫోన్ నంబర్ గాని ఇచ్చారా? అయితే మీ డేటాను అడ్వర్టైజ్మెంట్ కోసం ట్విట్టర్ వాడుకొని ఉండొచ్చు. ఈ విషయాన్ని స్వయంగా ఆ మైక్రో బ్లాగింగ్ సైటే వెల్లడించింది. తమ వెబ్సైట్లో సెక్యూరిటీ కోసం యూజర్లు ఇచ్చే ఈ-–మెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్లను యాక్సిడెంటల్గా అడ్వర్టైజింగ్ కోసం వాడి ఉండొచ్చని చెప్పింది. దీని వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో చెప్పలేమని వెల్లడించింది. తమ పార్ట్నర్లతో గానీ, ఇతర థర్డ్ పార్టీతో గానీ యూజర్ల పర్సనల్ డేటాను షేర్ చేసుకోలేదని కూడా చెప్పింది. ఓ అడ్వర్టైజర్ తన మార్కెటింగ్ లిస్టును అప్లోడ్ చేస్తే తను ఇచ్చిన డేటా, ట్విట్టర్ యూజర్లు తమ సెక్యూరిటీ కోసం ఇచ్చిన డేటా మ్యాచ్ అయి ఉండొచ్చంది. ‘ఏదేమైనా ఇది తప్పే. దీనికి క్షమాపణలు కోరుతున్నాం. ప్రతి విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉండాలని, దీన్ని అందరూ తెలుసుకోవాలని బయటకు చెప్పాం’ అని ట్విట్టర్ పేర్కొంది. దీని వల్ల ఇండియాలో ఎంతమంది ప్రభావితమయ్యారో కూడా కంపెనీ చెప్పలేదు. సెప్టెంబర్ 17 నాటికే ఈ సమస్యను పరిష్కరించామని, ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామంది. ఈ జూన్ క్వార్టర్లో ట్విట్టర్ మొనెటైజబుల్ యూసేజ్ 13.9 కోట్లు, గతేడాది ఇదే టైంకి ఇది 12.2 కోట్లు. ఏ దేశంలో ఎంత మంది వాడుతున్నారో మాత్రం ట్విట్టర్ వెల్లడించలేదు.

