హైదరాబాద్, వెలుగు: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సైంటిస్ట్ శ్రీధరన్ సురేశ్ హత్య మిస్టరీ వీడింది. నిందితుడు జనగామ శ్రీనివాస్ (39)ను ఎస్ఆర్ నగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి కత్తి, రెండు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ సుమతితో కలిసి సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. సురేశ్, శ్రీనివాస్ మధ్య స్వలింగ సంపర్క సంబంధం ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ప్రముఖ డయాగ్నస్టిక్స్ సెంటర్లో పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన శ్రీనివాస్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా రక్త పరీక్ష కోసం అక్కడికి వెళ్లిన సురేశ్కు శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా చనువుగా మారి స్వలింగ సంపర్కం వరకు వెళ్లింది. దీంతో కొంతకాలంగా శ్రీనివాస్, సురేశ్ ఉండే అమీర్పేట్ ధరమ్కరణ్రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్మెంట్లోని ఫ్లాట్నంబర్ ఎస్2కు వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సురేశ్ దగ్గరి నుంచి శ్రీనివాస్ అవసరాల కోసం డబ్బులు తీసుకునేవాడు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం డబ్బుల దగ్గర ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వకపోవడంతో సురేశ్ను చంపేందుకు శ్రీనివాస్ కుట్ర పన్నాడు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకి సురేశ్ తన ఇంటికి వెళ్లాడు. రాత్రి 7.30 గంటలకు శ్రీనివాస్ ఆయన ఫ్లాట్కు వచ్చాడు. రాత్రి 9.30 గంటలకు ఇద్దరి మధ్యా మరోసారి డబ్బు గురించి గొడవ జరిగింది. సురేశ్ తలపై శ్రీనివాస్ కత్తితో పొడిచి చంపేశాడు. సురేశ్ భార్య ఇందిర ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆయన ఫోన్ను తీసుకుని కాల్డేటా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, వేలి ముద్రలు, ఘటనా స్థలంలో పడి ఉన్న వెంట్రుకలను సేకరించారు. అపార్ట్మెంట్ వాచ్మన్, స్థానికులు ఇచ్చిన సమాచారంతో శ్రీనివాస్ కోసం గాలించారు. మూడు స్పెషల్ టీంలతో కరీంనగర్, రామగుండంలో వెతికారు. శుక్రవారం అతడిని అరెస్ట్ చేశారు.