- దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిని మోసగించిన దుండగులు
- ఢిల్లీ ఎయిర్పోర్టు వద్ద ఘటన
న్యూఢిల్లీ: కస్టమ్స్ అధికారులమని చెప్పి ఇద్దరు దుండగులు దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి దగ్గర ఉన్న డబ్బంతా దోచేశారు. తాను మోసపోయానంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది. రాజస్థాన్లోని అజ్మీర్కు చెందిన మహ్మద్ సులేమాన్ సౌదీ అరేబియా నుంచి ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగాడు. బయటికి రాగానే ఇద్దరు వ్యక్తులు దగ్గరికి వచ్చి తాము కస్టమ్స్ అధికారులమని చెప్పి అతడిని బెదిరించారు. అతని పాస్పోర్టు తీసుకుని, కారులో మహిపాల్పూర్వరకు తీసుకెళ్లారు.
ఎవరూ లేని చోట ఆపి సులేమాన్ దగ్గర ఉన్న 19 వేల సౌదీ రియాల్లు(రూ4.15లక్షలు) ఎక్కడివని ప్రశ్నించారు. ఆపై అతడి దగ్గరున్న రూ.2 వేల నగదు, మొబైల్ఫోన్ లాక్కున్నారు. మరో ఆఫీసర్ వస్తారని చెప్పి అతడిని అక్కడే దింపేసి ఉడాయించారు. కాసేపయినా ఎవరూ రాకపోవడంతో మోసపోయానని సులేమాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.