ఇంటి పర్మిషన్​కు రూ. లక్షన్నర లంచం

ఇంటి పర్మిషన్​కు రూ. లక్షన్నర లంచం
  • రెడ్ హ్యాండెడ్​గా పట్టుబడ్డ ఇద్దరు బల్దియా ఉద్యోగులు 
  •  టౌన్​ప్లానింగ్ సూపర్ వైజర్, రైటర్​ను అరెస్ట్ చేసిన ఏసీబీ

ఎల్​బీనగర్, వెలుగు : జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఇద్దరు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్​గా పట్టుబడ్డారు.  సరూర్ నగర్ జోనల్ ఆఫీసులో ఈ ఘటన జరిగింది. ఏసీబీ అధికారులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన జక్కేటి సుధాకర్ రెడ్డి వనస్థలిపురంలో ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు.  అనుమతుల కోసం సుధాకర్ రెడ్డి  జోనల్ ఆఫీసులోని హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్​లో దరఖాస్తు చేశాడు.  

టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ఉమ, రైటర్ లక్ష్మణ్​ రూ. 2 లక్షలు డిమాండ్ చేయగా చివరకు రూ. లక్షన్నరకు ఒప్పుకున్నారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.  గురువారం ఆఫీసులో లంచం తీసుకుంటుండగా ఇద్దరు ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. 

సూపర్​ వైజర్​ ఇంట్లో తనిఖీలు? 

సూపర్ వైజర్ ఉమ ఇంట్లోనూ తనిఖీలు ఏసీబీ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఇంట్లో భారీగా బంగారం, క్యాష్, విలువైన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  ఉమ హయత్​నగర్ సర్కిల్​సెక్షన్​లో పనిచేస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆమె ఏసీబీకి పట్టుబడినట్టు తెలియడంతో  ఆఫీసుకు వచ్చిన కొందరు జనం సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం.