న్యూఢిల్లీ: కరోనాపై పోరులో ఇండియా పూర్తి నిబద్ధతతో బలంగా ముందుకెళ్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్దన్ తెలిపారు. శుక్రవారం సీఎస్ఐఆర్ టెక్నాలజీస్ ఫర్ కొవిడ్–19 మిటిగేషన్ కంపెండియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్ష వర్దన్ పాల్గొన్నారు. కరోనాకు వ్యతిరేకంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సైంటిస్టుల శ్రమను, హార్డ్ వర్క్ను మెచ్చుకున్నారు. దేశంలోని రెండు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయని తెలిపారు.
‘కంపెండియంలో కరోనాపై పోరాడటానికి చాలా టెక్నాలజీలు, ప్రొడక్ట్స్ ఉంటాయి. స్పాన్నింగ్ డయాగ్నోస్టిక్స్, డ్రగ్స్, వెంటిలేటర్స్, పీపీఈలతోపాటు 100కు పైగా టెక్నాలజీలు, 93 ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ దీంట్లో భాగంగా ఉన్నాయి. వీటిల్లో 60కి పైగా టెక్నాలజీస్ను కమర్షియల్ ప్రొడక్షన్కు తరలిస్తున్నాం. మహమ్మారితో మేం పూర్తి బలంతో పోరాడుతున్నాం. రెండు ఇండియన్ కంపెనీలు క్లినికల్ ట్రయల్ ఫేజ్కు చేరుకున్నాయి. ఇది గర్వపడే విషయం’ అని హర్షవర్దన్ చెప్పారు.