గర్భిణులకు అబార్షన్ కేసులో ..హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్పై యాక్షన్

గర్భిణులకు అబార్షన్ కేసులో ..హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్పై యాక్షన్
  • పర్మిషన్, రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన కలెక్టర్​ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు: లింగ నిర్ధారణ పరీక్ష చేసి ఇద్దరు గర్భిణులకు అబార్షన్లు చేసిన కేసులో హాస్పిటల్​పర్మిషన్​తో పాటు డయాగ్నోస్టిక్​ సెంటర్​ రిజిస్ట్రేషన్​ను కలెక్టర్​ రద్దు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వీరవెల్లి, తుర్కపల్లి మండలం పెద్దతండాకు చెందిన ఇద్దరు గర్భిణులు ఈ ఏడాది జులైలో భువనగిరిలోని ఎస్​ఎల్​ఎన్​ఎస్​ డయాగ్నోస్టిక్​సెంటర్​లో డాక్టర్​ పాండు గౌడ్​వద్ద లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.

 కడుపులో ఉన్నది అమ్మాయిలు అని తేలడంతో వీరిద్దరు భువనగిరిలోని గాయత్రి హాస్పిటల్​లో డాక్టర్​హీరేకార్​శివకుమార్​వద్ద జులై 6న అబార్షన్​ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న భువనగిరి ఎస్​వోటీ పోలీసులు మరుసటి రోజు తెల్లవారుజామున హాస్పిటల్​పై దాడులు నిర్వహించారు. అబార్షన్​ చేసి వెలికి తీసిన పిండాలను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్​ శివకుమార్​, డాక్టర్​పాండు గౌడ్​పై కేసులు నమోదు చేశారు. 

కలెక్టర్​ ఆదేశాలతో విచారణ..

అబార్షన్ల ఘటనపై కలెక్టర్​ హనుమంతరావు ఆదేశాలతో జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ,  అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ హెల్త్​ టీంలు విచారణ జరిపాయి. డాక్టర్​ శివకుమార్ ఎంబీబీఎస్​పాస్​కాకున్నా డాక్టర్​గా చెలామణి అవుతున్నట్లు తేలింది. ఎస్ఎల్ఎన్ఎస్​ డయాగ్నోస్టిక్​ సెంటర్​లోని ఫారం -ఎఫ్​ రికార్డుల్లో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించారు. హాస్పిటల్​తో పాటు డయాగ్నోస్టిక్​ సెంటర్​కు షోకాజ్​ నోటీసులు ఇచ్చారు. నిర్వాహకులు ఇచ్చిన వివరణ సరిగ్గా లేకపోవడంతో అన్ని రిజిస్ట్రేషన్లు, పర్మిషన్లను రద్దు చేస్తూ కలెక్టర్​ హనుమంతరావు శనివారం ఆదేశాలు జారీ చేశారు.