రాజస్థాన్ లో మతమార్పిడి, లవ్ జిహాద్ కు సంబంధించిన కార్యకలాపాలకు పాల్పుగుతున్నారనే ఆరోపణలతో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్. మరో ఉపాధ్యాయుడు కూడా విచారణ జరుగుతోంది. కోటలోని సంగోడ్ బ్లాక్ లోని ఓ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈక్రమంలో ఓ వీడియోను విడుదల చేశారు మంత్రి దిలావర్.
సెకండరీ స్కూల్ లో చదువుతున్న ఓ హిందూ బాలిక పేరును ముస్లిం పేరుగా మార్చినట్లు మాకు సమాచారం అందింది. ఈ ప్రాంతంలో మతమార్పిడి, లవ్ జిహాద్ కుట్ర జరుగుతున్నట్లు అనుమానం ఉందని మాకు సమాచారం అందడంతో దీంతో సంబంధం ఉన్న ఇద్దరు టీచర్లను సస్పండ్ చేశామన్నారు విద్యాశాఖ మంత్రి దిలావర్. వారు ఈ చర్యలకుపాల్పడ్డారని తేలితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు అని తెలిపారు.
సస్పెండ్ అయిన ఉపాధ్యాయులను మీర్జా ముజాహిద్, ఫిరోజ్ ఖాన్ లుగా గుర్తించారు. 2019 నుంచి పాఠశాలలో మతమార్పిడి, లవ్ జిహాద్ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ సర్వ హిందూ సమాజ్, సంగోడ్ విద్యామంత్రికి మెమోరాండం పంపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఉపాధ్యాయులకు పాకిస్తానీ గ్రూపులతో సంబంధాలున్నట్లు సర్వహిందూ సమాజ్ ఆరోపించింది.