- ఇద్దరు దొంగల అరెస్ట్.. 26 బైక్ లు స్వాధీనం
- సూర్యాపేట ఎస్పీ నరసింహ వెల్లడి
సూర్యాపేట, వెలుగు: ఖరీదైన బైక్ లను ఎత్తుకెళ్తున్న ఇద్దరిని సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బుధవారం సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున టౌన్ సీఐ వెంకటయ్య , ఎస్ఐ సురేశ్ సిబ్బందితో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఒకరు అనుమానాస్పదంగా వెళ్తుండగా ఆపారు. అతని వేలిముద్రలు చెక్ చేసి 50 బైక్ చోరీ కేసుల్లో నిందితుడైన చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడెంకు చెందిన వేమూరి కృష్ణగా గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో ఖరీదైన బైక్లే టార్గెట్ గా 26 చోరీ చేసినట్టు చెప్పాడు. వీటిని నకిరేకల్ మండలం ఆర్లగడ్డగూడెంకు చెందిన రేఖల శివకుమార్ తో కలిసి చేసినట్టు వివరించాడు. ఒకటి కృష్ణ ఉంచుకుని, మిగిలిన 25 బైక్ లను శివకుమార్ వద్ద దాచాడు. అతను 4 బైక్ లను నకిరేకల్ మండలంలో తెలిసినవారికి అమ్మాడు. మిగిలినవాటిని ఇంటి వద్ద దాచాడు. నిందితుల వద్ద బైక్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వేమూరి కృష్ణ భార్యా పిల్లలను వదిలేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇప్పటికే పలు కేసుల్లో కృష్ణ జైలుకు వెళ్లొచ్చినా చోరీలు ఆపడంలేదు. డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకటయ్య, ఎస్ఐ సురేశ్ ఉన్నారు.
