చంపేసి బీరువాలో దాచిన్రు

చంపేసి బీరువాలో దాచిన్రు

రెండేండ్ల బాబుపై మేనత్తల దుర్మార్గం

బాబు తల్లిపై జెలసీతోనే చేశారన్న పోలీసులు

యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఘటన

నోయిడా: పుట్టింటికి వచ్చినపుడు వదిన తమను సరిగా చూసుకోవడంలేదని, తోడబుట్టిన వాడు కూడా వదినకే వత్తాసు పలుకుతున్నడని ఇద్దరు ఆడబిడ్డలు దారుణానికి తెగబడ్డరు. వదినపై జెలసీని మేనల్లుడిపై చూపించిన్రు. రెండేండ్ల బాబును గొంతు నులిమి చంపేసి, బీరువాలో దాచి వెళ్లిపోయిన్రు. కొడుకు కనిపించక ఊరంతా వెతికిన తల్లిదండ్రులు చివరకు బాబు డెడ్​బాడీని చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఉత్తరప్రదేశ్​లోని గ్రేటర్​ నోయిడాలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలను డీసీపీ హరీశ్​ చందర్​ మీడియాకు తెలిపారు.

గత నెల 29న బాబు కనిపించడంలేదంటూ సూరజ్​పూర్​ పోలీస్​ స్టేషన్​లో స్వప్న కంప్లైంట్​ చేసింది. అయితే, అదేరోజు రాత్రి తన ఇంట్లోని బీరువాలో బాబును గుర్తించి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఊపిరాడక బాబు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసుల విచారణలో బాబు మేనత్తలు రింకి, పింకీలే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని తేలింది. తమతో వదిన సరిగా ప్రవర్తించడంలేదని వాళ్లిద్దరూ గతంలో చాలాసార్లు అన్నకు ఫిర్యాదు చేశారు. అయినా వదినలో మార్పు రాలేదని కోపం పెంచుకున్నరు. దీనికితోడు అన్న కూడా తమనే తప్పుబట్టడంతో వారి కోపం మరింత పెరిగింది. దీంతో ఆ కోపాన్ని రెండేళ్ల వయసున్న మేనల్లుడిపై చూపించారు. బాబు గొంతు నులిమి చంపేసి, దుప్పట్లో చుట్టి బీరువాలో దాచేశారు. ఆపై ఏమీ తెలియనట్లు తమ అత్తారింటికి వెళ్లిపోయారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో బాబును చంపేసింది తామేనని ఒప్పుకున్నారు.