సనాతన దుర్మార్గపు వైఖరి మారాలి.. స్టాలిన్కు మ‌ద్ద‌తుగా పా. రంజిత్

సనాతన దుర్మార్గపు వైఖరి మారాలి.. స్టాలిన్కు మ‌ద్ద‌తుగా పా. రంజిత్

డీఎంకే నేత‌, మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ (Udhyanithi Stalin) స‌నాత‌న ధర్మంపై చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. సనాతన ధర్మం (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని స్టాలిన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. స్టాలిన్‌ వ్యాఖ్యలపై అర్చకులు, మతపెద్దలు, బీజేపీతో సహా.. కొన్ని పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ.. ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. 

ఈ విషయంలో ఉదయనిధి స్టాలిన్ కు ద‌ర్శ‌కుడు పా.రంజిత్ (PA. Ranjith) మ‌ద్ద‌తుగా నిలిచారు.  ఈమేరకు ట్విట్టర్ వేదికగా ఆయన మద్దతును తెలిపారు.. స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాలని దశాబ్దాలుగా జ‌రుగుతున్న కుల వ్యతిరేక పోరాట ముఖ్య ఉద్దేశం. కుల వివక్ష, లింగ వివక్ష ఈ రెండు సనాతన ధర్మం నుండి వ‌చ్చిన‌వే. అంబేద్కర్, ఇయోథీదాస్ పండితార్, తంతి పెరియార్, మహాత్మా ఫూలే, సంత్ రవిదాస్ వంటి విప్లవకారులు కుల వివక్ష నిర్మూలన కోసం పోరాడారు.

ఉద‌య‌నిధి స్టాలిన్ వ్యాఖ్యలను కొందరు కావాలని వక్రీకరించి మారణహోమానికి పిలుపునిస్తున్నారు. ఈ దుర్మార్గపు వైఖరి మంచిది కాదు. స్టాలిన్‌పై పెరుగుతున్న ద్వేషం, చంపేయాలని వ‌స్తున్న ప్ర‌క‌ట‌న‌లు కలవరపెడుతున్నాయి.

ALSO READ : నీ నిజాయితీకి నిజంగా దండం పెట్టాలి తల్లీ : తన గొర్రె పిల్లకు రైలు టికెట్ తీసుకుంది

సామాజిక న్యాయం,సమానత్వం కోసం సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ చేసిన మాటలకు నేను మద్దతు తెలుపుతున్నాను. స్టాలిన్‌కి నా సంఘీభావం.. అంటూ రాసుకొచ్చారు పా. రంజిత్. ప్రస్తుతం దర్శకుడు పా. రంజిత్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనిపై కూడా హిందూ సంఘాలు పెద్దఎత్తున మండిపడుతున్నాయి.