
హైదరాబాద్, వెలుగు: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. నికర లాభం ఏడాది లెక్కన 75శాతం తగ్గి రూ. 83 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ. 329.63 కోట్లుగా ఉంది. అధిక కేటాయింపుల కారణంగా లాభం తగ్గింది. మొత్తం ఆదాయం సంవత్సరానికి 4.4శాతం పెరిగి రూ. 1,843 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 1,765 కోట్లుగా ఉంది.
2025 ఆర్థిక సంవత్సర నికర లాభం రూ. 726 కోట్లుగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరం రూ. 1,281.50 కోట్లతో పోలిస్తే తగ్గింది. పూర్తి సంవత్సరానికి మొత్తం ఆదాయం ఏడాది లెక్కన 11శాతం పెరిగి రూ. 7,201 కోట్లకు చేరుకుంది. గ్రాస్ లోన్ బుక్ విలువ ఏడాది లెక్కన 8శాతం పెరిగి రూ. 32,122 కోట్లకు చేరుకుంది. స్థూల ఎన్పీఏలు 2.2శాతం, నెట్ఎన్పీఏలు 0.5శాతం ఉన్నాయి.