రాజ్యాంగబద్ధ సంస్థలు

రాజ్యాంగబద్ధ సంస్థలు

రాజ్యాంగంలోని ఆర్టికల్​ 338 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు నిర్దేశించిన రక్షణల అమలును అధ్యయనం చేయడానికి రాష్ట్రపతి కమిషనర్​ను లేదా ప్రత్యేకాధికారిని నియమించవచ్చు. దీనిని అనుసరించి 1978లో జనతా ప్రభుత్వం కార్యనిర్వాహకశాఖ ఉత్తర్వు ద్వారా ఏకసభ్య కమిషన్​ స్థానంలో బహుళ సభ్య కమిషన్​ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్​ 1978 ఆగస్టు నుంచి అమలులోకి రాగా భోళా పాశ్వాన్​ శాస్త్రి తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1990లో వి.పి.సింగ్​ ప్రభుత్వ హయాంలో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్​ను రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు.

ఇది 1992, మార్చి 12 నుంచి అమలులోకి వచ్చింది. మొదటి చైర్మన్​ ఎస్​.హెచ్​.రామ్​థన్​ (1992–95), రెండో చైర్మన్​ హెచ్​.హనుమంతప్ప (1995–98), మూడో చైర్మన్​ దిలీప్​సింగ్​ భూరియా (1998–2002), నాలుగో చైర్మన్​ బిజయ్​ సొంకర్​ శాస్త్రి (2002–04) వ్యవవహరించారు. ఆ తర్వాత 89వ రాజ్యాంగ సవరణ–2003 ద్వారా కొత్తగా 338ఏ అనే ఆర్టికల్ ను చేర్చి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్​ను విభజించి వేర్వేరుగా జాతీయ ఎస్సీ కమిషన్​, ఎస్టీ కమిషన్​ ఏర్పాటు చేశారు. 

జాతీయ ఎస్సీ కమిషన్ : రాజ్యాంగంలో 338 నిబంధన ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్​ ఏర్పాటైంది. ఇది 2004, ఫిబ్రవరి 20 నుంచి అమలులోకి వచ్చింది. కమిషన్​కు ఒక చైర్మన్​, వైస్​ చైర్మన్​, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు మహిళా సభ్యురాలు తప్పకుండా ఉండాలి. ఈ కమిషన్​ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. ఆయనే  తొలగిస్తారు. వీరి కాల పరిమితి మూడు సంవత్సరాలు. ఈ కమిషన్​ తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి పార్లమెంట్​కు సమర్పిస్తారు. ఈ నివేదికలను పార్లమెంట్​ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ పరిశీలిస్తుంది. 

విధులు : రాజ్యాంగపరంగా షెడ్యూల్డ్​ కులాలకు నిర్దేశించిన రక్షణలు, వాటి అమలు తీరును అధ్యయనం చేయడం.

  •     షెడ్యూల్డ్​ కులాల ఆర్థిక, సాంఘిక స్థితిగతులను మెరుగుపరచడానికి తగిన సూచనలు చేయడం.
  •     ఎస్సీ హక్కుల ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను విచారించడం, కొన్ని సందర్భాల్లో ఫిర్యాదులు లేకుండా సుమోటోగా కేసులను విచారించవచ్చు. 
  •     పౌర హక్కుల పరిరక్షణ చట్టం – 1955, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం–1989 అమలు తీరుపైన విచారణ చేస్తుంది.  

జాతీయ ఎస్టీ కమిషన్ : రాజ్యాంగంలోని 16వ భాగంలోని 338 (ఎ) నిబంధన ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్​ ఏర్పాటు చేయబడింది. ఇది 2004, ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి వచ్చింది. కమిషన్​కు ఒక చైర్మన్​, వైస్​ చైర్మన్​, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు మహిళా సభ్యురాలు తప్పకుండా ఉండాలి. ఈ కమిషన్​ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. ఆయనే  తొలగిస్తారు. వీరి కాల పరిమితి మూడు సంవత్సరాలు. ఈ కమిషన్​ తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి పార్లమెంట్​కు సమర్పిస్తారు. పార్లమెంట్​లో ఈ నివేదికలను పార్లమెంట్​ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ పరిశీలిస్తుంది. 

విధులు : రాజ్యాంగం షెడ్యూల్డ్​ తెగలకు నిర్దేశించిన రక్షణల అమలు తీరును అధ్యయనం చేయడం.

  •     షెడ్యూల్డ్​ తెగల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి తగిన సూచనలు చేయడం.
  •     అటవీ హక్కుల రక్షణ చట్టం–2006ను అధ్యయనం చేసి, దానిని మరింతగా మెరుగుపరిచి అమలు చేయడానికి తగిన సూచనలు చేయడం.
  •     రాష్ట్రపతి నిర్దేశించిన ఇతర విధులు

అధికారాలు : ఈ కమిషన్​కు సివిల్​ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. ఏదైనా న్యాయస్థానం లేదా ఆఫీసు నుంచి అవసరమైన సమాచారాన్ని అడగడం, ఏ అధికారికైనా సమన్లు జారీ చేయడం, ఏ పత్రాన్నైనా పరిశీలించడం, శిక్షలు విధించడం, కోర్టు ధిక్కార చట్టాన్ని అమలు చేయడం, సాక్షుల విచారణ వంటి అధికారాలుంటాయి. 

జాతీయ బీసీ కమిషన్ ​: 102వ రాజ్యాంగ సవరణ చట్టం–2018 ప్రకారం రాజ్యాంగంలో 338బిని చేర్చుతూ జాతీయ బీసీ కమిషన్​కు రాజ్యాంగబద్ధత కల్పించారు. దీంతో గతంలో ఉన్న జాతీయ బి.సి.కమిషన్​ చట్టం–1993ను తొలగించారు.  కమిషన్​కు ఒక చైర్మన్​, వైస్​ చైర్మన్​, ముగ్గురు సభ్యులు ఉంటారు. చైర్మన్​గా నియమించే వ్యక్తికి సుప్రీంకోర్టులో గానీ, హైకోర్టులో గానీ పనిచేస్తున్న న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలుండాలి. లేదా న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వారై ఉండవచ్చు. చైర్మన్​, సభ్యులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. అభియోగాలు మోపబడిన చైర్​పర్సన్​, సభ్యులపై సుప్రీంకోర్టున్యాయమూర్తితో విచారణ చేయించి, నిరూపణ అయితే రాష్ట్రపతి తొలగిస్తారు. 

విధులు : బీసీ కులాల్లో చేర్చాల్సిన లేదా తొలగించాల్సిన కులాలను సూచించడం

  •     బీసీల స్థితిగతులను అధ్యయనం చేయడం
  •     క్రిమిలేయర్​ పరిమితిని సూచించడం
  •      సివిల్​ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి. 

కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్ : 

రాజ్యాంగంలోని ఐదో భాగంలో ఆర్టికల్​ 148 నుంచి 151 వరకు గల నిబంధనలు కాగ్​ అనే పదవి గురించి వివరిస్తాయి. కాగ్​ పదవిని బ్రిటన్​ నుంచి గ్రహించారు. ఇది రాజ్యాంగరీత్యా అత్యున్నత పదవి. ఇతను భారత ఆడిట్​ అండ్​ అకౌంట్​ విభాగానికి అధిపతి. ఇతను భారత ప్రజాధనానికి లేదా ఖజానాకు సంరక్షకుడు. ఆర్టికల్​ 148 ప్రకారం దేశానికి ఒక కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్​ ఉంటారు. ఈ అధికరణ కాగ్​ నియామకం, పదవీ విరమణ, స్వీకారం, సేవానిబంధనల గురించి తెలుపుతుంది. ఇతని అర్హతలను పార్లమెంట్​ నిర్ణయిస్తుంది. ఇతనికి 10 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉండాలి. కాగ్​ పదవీకాలం ఆరు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు, ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. సేవా నిబంధనలపై 1971లో చట్టం చేశారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా ప్రత్యేక మెజార్టీ అంటే 2/3వంతు  మెజార్టీతో పార్లమెంట్​  తొలగిస్తుంది. అధికారికంగా పార్లమెంట్​ సూచనతో రాష్ట్రపతి తొలగిస్తారు. ఈ తొలగింపు అసమర్థత, అక్రమ ప్రవర్తన ఆధారంగా చేస్తారు. కాగ్​ను పదవీరీత్యా కంట్రోలర్​ అని పేర్కొన్నా వాస్తవంలో ఇతను ఎలాంటి నియంత్రణ చేయకుండా కేవలం అకౌంట్లను మాత్రమే తనిఖీ చేస్తాడు. అందుకే ఇతని పనితీరును శవపరీక్షతో పోలుస్తారు. కేంద్రంలో రాష్ట్రపతికి, రాష్ట్రంలో గవర్నర్​కు తన నివేదికలు ఇస్తుంది. కాగ్​ తన పదవీ విరమణ తర్వాత ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం చేపట్టరాదు. 

స్వతంత్ర ప్రతిపత్తి : రాష్ట్రపతి నియమిస్తాడు. 

  •     పదవీకాలం నిర్దిష్టంగా ఉండి భద్రతను కలిగి ఉండటం.
  •     జీతభత్యాలకు, సేవా నిబంధనలకు రక్షణ.
  •     తొలగింపు ప్రక్రియ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పోలి ఉండటం.
  •     రిటైర్మెంట్​ తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవిలో ఉండకపోవడం.