అఫ్గానిస్థాన్ను తమ గుప్పెట్లోకి తెచ్చుకున్న తాలిబాన్లను పంజ్షీర్ ప్రావిన్స్ ఒక్కటే ముప్పతిప్పలు పెడుతోంది. నిన్ననే పంజ్షీర్ లోయను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని ప్రకటించుకున్న తాలిబాన్లకు ఇవాళ ఊహించని షాక్ తగిలింది. తాలిబాన్ ఫైటర్స్ క్యాంపులు ఉన్న ఏరియాలపై సడన్గా మిలటరీ ప్లేన్స్ మెరుపు దాడులు చేశాయని అఫ్గాన్ చానెల్స్లో వార్తలు వస్తున్నాయి. అయితే అవి ఏదైనా పొరుగు దేశానికి చెందినవా? లేక పంజ్షీర్లోని నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఎవరి సాయమైనా తీసుకుని అటాక్స్కు దిగిందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
సోమవారం పంజ్షీర్లో దాడులు చేసి నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ను నడిపిస్తున్న అహ్మద్ మసౌద్కు అత్యంత సన్నిహితులైన ఫహీం దష్తీ, జనరల్ అబ్దుల్ వదూద్, ఫోర్సెస్ కమాండర్ మునీబ్ అమిరి, జనరల్ జల్ హైదర్ వంటి వాళ్లను తాలిబాన్లు చంపేశారు. వేర్వేరు ప్రాంతాల్లో 600 మందికి పైగా తాలిబాన్లను మట్టుబెట్టునట్లు ప్రకటించిన తర్వాతి రోజే ఈ పరిణామాలు జరిగాయి. అయితే ఈ ఘటనతో ప్రతీకారంతో రగిలిపోయిన తాలిబాన్లు పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్ సాయంతో పంజ్షీర్లో దాడులు చేసి రెసిస్టెన్స్ ఫోర్స్ను దెబ్బకొట్టారన్న ఆరోపణలు వచ్చాయి. రెసిస్టెన్స్ ఫోర్స్లో కీ రోల్లో ఉన్న వాళ్లు ప్రాణాలు కోల్పోయినప్పటికీ పంజ్షీర్ నాయకులు అహ్మద్ మసౌద్, అమ్రుల్లా సలేహ్ ధైర్యం కోల్పోలేదు. తాలిబాన్లపై తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో ఇవాళ (మంగళవారం) పంజ్షీర్లో తాలిబాన్లపై మిలటరీ ప్లేన్ దాడులు జరగడం గమనార్హం.