పాట్నా : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అల్లరి మూకల ఆటలు సాగనివ్వబోమన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) అవినీతి కూటమికి అధికారం మరోసారి దక్కదని చెప్పారు. నవాడా జిల్లాలోని హిసువాలో ఆదివారం జరిగిన సభలో షా మాట్లాడారు. శ్రీరామ నవమి రోజున ససారామ్, బీహార్ షరీఫ్లో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ససారామ్లో అమాయక ప్రజలపై బులెట్ల వర్షం కురిపిస్తున్నారని, ఉద్రిక్తతల కారణంగానే తాను అక్కడికి వెళ్లలేకపోతున్నానని అన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు తాను గవర్నర్తో మాట్లాడితే.. జేడీయూ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం దేశంలో భాగమేనని, తాను దేశానికి హోం మంత్రిని అనే సంగతి గుర్తుంచుకోవాలని వాళ్లకు సూచించారు.
జేడీయూకి బీజేపీ డోర్లు మూసేసినం
తన కొడుకు తేజస్వీ యాదవ్ బీహార్కు సీఎం అవుతాడని లాలూ ప్రసాద్ యాదవ్ ఆశిస్తున్నారు కానీ నితీశ్ గురించి ఆయనకు తెలియదని అమిత్ షా అన్నారు. ప్రధాని సీటు దక్కదని తేలిపోయాక తేజస్వీకి అధికారం అప్పగించేందుకు నితీశ్ ఇష్టపడడని వివరించారు. బీహార్లో ఈసారి మొత్తం 40 ఎంపీ సీట్లను గెల్చుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జేడీయూకు ఎన్డీయే డోర్లు క్లోజ్ చేశామని, నితీశ్ పార్టీని మిత్రపక్షంగా అంగీకరించేదిలేదని స్పష్టం చేశారు. ఆయోధ్య రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, తృణమూల్ పార్టీలు వ్యతిరేకించాయని, శంకుస్థాపన చేసి నిర్మించిన ఘనత మోడీకే దక్కుతుందని అమిత్షా గుర్తుచేశారు.