- ఎంటీఎన్ఎల్కు ఫ్యూచర్ లేదని వ్యాఖ్య
న్యూఢిల్లీ: సరిగ్గా పనిచేయలేకపోతే తట్టాబుట్టా సర్దుకొని సంస్థను వీడాలని టెలికం మినిస్టర్ అశ్విని వైష్ణవ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘ప్రభుత్వ ఉద్యోగం’ అనే యాటిట్యూడ్ను బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు విడిచిపెట్టాలని అన్నారు. సంస్థను లాభాల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, అలానే ఉద్యోగులు కూడా తాము చేయాల్సిన పనులను సరిగ్గా చేయాలని అన్నారు.
ప్రతి నెలా ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తానని అన్న ఆయన, సరిగ్గా పనిచేయని ఉద్యోగులకు ఎర్లీ రిటైర్మెంట్ ఇచ్చి పంపించేస్తామని పేర్కొన్నారు. ఎంటీఎన్ఎల్కు ఎటువంటి ‘ఫ్యూచర్’ లేదని వైష్ణవ్ వ్యాఖ్యానించారని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. ‘ఎంటీఎన్ఎల్కు ఎటువంటి ఫ్యూచర్ లేదు. దానికి మేమేం చేయలేము. మనందరికీ తెలుసు ఎంటీఎన్ఎల్ ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటుందో. ఈ సంస్థకు సంబంధించి భిన్నమైన చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, బీఎస్ఎన్ఎల్కు చెందిన 62 వేల మంది ఉద్యోగులకు వైష్ణవ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ టెలికం కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్తో ఆయన సమావేశమయ్యారు. కాగా, నష్టాల్లో కూరుకుపోయి ఉన్న బీఎస్ఎన్ఎల్ను కాపాడేందుకు రూ. 1.64 కోట్ల విలువైన రివైవల్ ప్యాకేజిని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సత్తా చూపలేకపోతే దుకాణం సర్దేయ్యండి. ఈ విషయంపై మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఇక నుంచి ఇలానే ఉంటుంది’ అని వైష్ణవ్ పేర్కొన్నారు.
జియో, ఎయిర్టెల్తో పోటీ పడండి..
కస్టమర్ల కోసం రిలయన్స్ జియో, ఎయిర్టెల్తో బీఎస్ఎన్ఎల్ తీవ్రంగా పోటీ పడాలని వైష్ణవ్ ఈ సంస్థ ఉద్యోగులకు చెప్పినట్టు సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ‘పని చేయలేమనుకునే వారు వీఆర్ఎస్ ను మొహమాటం లేకుండా తీసుకొని ఇంటికి వెళ్లిపోవచ్చు. వీఆర్ఎస్ను తీసుకోవడంలో బెట్టు చేస్తే 56జే (ఎర్లీ రిటైర్మెంట్కు ఆదేశించే రూల్) ను వాడతాం. అందువలన ఉద్యోగులు బాగా పనిచేయాల్సిందే”అని స్పష్టంచేశారు.
మురికిగా బీఎస్ఎన్ఎల్ ఆఫీస్లు..
సంస్థ కార్యకలాపాలు అధ్వాన్నంగా కొనసాగడమే కాదు బీఎస్ఎన్ఎల్ ఆఫీసులు శుభ్రంగా కూడా లేవని వైష్ణవ్ ఆరోపించారు. ఝర్సుగూడా (ఒడిశా) లోని బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజిని తాను పరిశీలించానని, అక్కడి మురికి చూసి ఆసహ్యంగా అనిపించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే ఊరుకోనని, హెడ్ ఆఫీసర్లే దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు.
‘హెడ్ ఆఫీసర్లపై వేటు పడుతుంది. ఇది మాత్రం పక్కా. ఆఫీసుల్లో పనిచేస్తున్న వారు, వారి సూపర్వైజర్లు కూడా బాధ్యత వహించాల్సిందే’ అని వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ను దగ్గరుండి పరిశీలిస్తానని వైష్ణవ్ అన్నారు. ‘బీఎస్ఎన్ఎల్కు రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చి రిస్క్ చేశాం. ఏ సమస్య అయినా బీఎస్ఎన్ఎల్ వెనుక మేమున్నాం. ఇదే లెవెల్లో 62 వేల మంది ఉద్యోగులు కూడా కట్టుబడి ఉండాలని ఆశిస్తున్నాం”అని మంత్రి స్పష్టం చేశారు.