- కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావు
ధర్మసాగర్, వెలుగు: దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఆదేశించారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంప్ హౌజ్ ను శుక్రవారం ఆయన పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి పంప్ హౌజ్ లోని పంపుల కెపాసిటీ, పనితీరు, స్కాడా వ్యవస్థ గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్, సౌత్ మెయిన్ కెనాల్ ను పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ కుల్దీప్ సింగ్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ శ్రీనివాస్, హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి, ఈఎన్సీ జనరల్ రమేశ్ బాబు, చీఫ్ ఇంజినీర్ సుధీర్, ఇరిగేషన్ ఎస్ఈ రాంప్రసాద్, ఈఈలు సీతారాం, మంగీలాల్, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేశ్, జిల్లా సాగు నీటిపారుదల శాఖ అధికారి రామ్మోహన్ ఉన్నారు.
రామప్ప సందర్శన
వెంకటాపూర్(రామప్ప): యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావు సందర్శించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో ఈవో ఇమ్మడి భాస్కర్ ఆయనను శాలువతో సత్కరించారు. ఆలయ చరిత్ర శిల్పకళా వైభవాన్ని టూరిజం గైడ్ వెంకటేశ్ వివరించారు. ఆయన వెంట తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై రాజు, ఆర్ఐ రమేశ్, దశరథ్, శ్రీకాంత్, దేవాదాయ, పురావస్తు, పోలీస్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
