
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సెన్సేషనల్ కామెంట్స్
ముంబై: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మన దేశంలో ప్రజలను ఎవరైతే ఎక్కువ ఫూల్స్ చేయగలరో వారే గొప్ప నాయకులవుతారన్నారు. రాజకీయాల్లో నిజం మాట్లాడటం నిషిద్ధమని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈమేరకు ఆయన సోమవారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో అఖిల భారతీయ మహానుభావ్ పరిషత్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు.
"జీవితంలో షార్ట్ కట్స్ అనేవి ఫలితాలను వేగంగా ఇస్తాయి. కానీ మనపై ఇతరులకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. అందుకే మనం నిజాయతీ, విశ్వసనీయత, అంకితభావం, సత్యం వంటి విలువలతో జీవించాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చివరికి సత్యమే గెలుస్తుందని చెప్పారు. కానీ, రాజకీయాల్లో నిజం చెప్పడమనేది నిషిద్ధంగా మారింది. ప్రజలను ఎవరు ఎక్కుగా ఫూల్స్ చేస్తారో వాళ్లే బెస్ట్ లీడర్లు అవుతున్నారు" అని నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు.
గడ్కరీ గతంలోనూ ప్రభుత్వ నిర్ణయాలపై, రాజకీయ వ్యవస్థపై సూటిగా విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టుల్లో సవాలు చేస్తేనే పరిపాలనలో క్రమశిక్షణ పెరుగుతోందని, మంత్రులు చేయలేని పనులను న్యాయస్థానాలు చేయిస్తున్నాయని ఇటీవల అన్నారు.