
- సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య చర్యలు
- వరల్డ్ చాంపియన్షిప్లోతటస్థ అథ్లెట్లుగా పోటీ పడనున్న ఇండియా రెజ్లర్లు
న్యూఢిల్లీ: ఇండియా రెజ్లింగ్కు భారీ షాక్ తగిలింది. సకాలంలో ఎన్నికలకు నిర్వహించడంలో విఫలం అయిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)ని వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సమాఖ్య పాలక మండలి సస్పెండ్ చేసింది. భూపేందర్ సింగ్ బజ్వా నేతృత్వంలోని డబ్ల్యూఎఫ్ఐ తాత్కాలిక ప్యానెల్ యూడబ్ల్యూడబ్ల్యూ ఇచ్చిన 45 రోజుల గడువులోగా ఎన్నికల నిర్వహించకపోవడంతో వరల్డ్ బాడీ కఠిన చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని యూడబ్ల్యూడబ్ల్యూ బుధవారం రాత్రి డబ్ల్యూఎఫ్ఐ తాత్కాలిక ప్యానెల్కు తెలిపింది. దాంతో సెప్టెంబర్ 16న మొదలయ్యే వరల్డ్ చాంపియన్షిప్స్లో మన దేశ రెజ్లర్లు ఇండియా జెండాతో కాకుండా తటస్థ అథ్లెట్లుగా పోటీ పడనున్నారు. ఈ పరిణామం ఇండియా రెజ్లర్లపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే, సెప్టెంబర్ 23 నుంచి హాంగ్జౌలో జరిగే ఆసియా గేమ్స్లో మాత్రం మన రెజ్లర్లు ఇండియా జెండాతోనే పోటీపడవచ్చు. ఎందుకంటే ఈ మెగా ఈవెంట్కు ఐఓఏ నుంచి ఎంట్రీలు వెళ్లాయి.
హెచ్చరించినా వినలే
డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్పై లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత ఫెడరేషన్ కార్యవర్గాన్ని రద్దు చేసిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఏప్రిల్ 27న తాత్కాలిక ప్యానెల్ను నియమించింది. 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే డబ్ల్యూఎఫ్ఐని సస్పెండ్ చేస్తామని ఏప్రిల్ 28నే యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్చరించింది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ, ఐఓఏకు కూడా అప్పుడే స్పష్టం చేసింది. వాస్తవానికి డబ్ల్యూఎఫ్ఐకి మే7న ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. కానీ, క్రీడా మంత్రిత్వ శాఖ ఆ ప్రక్రియను రద్దు చేసింది. ఆ తర్వాత ఫెడరేషన్ను నడిపించేందుకు ఐఓఏ తాత్కాలిక ప్యానెల్ను ఏర్పాటైంది. ఆపై, రిటర్నింగ్ అధికారి జులై11న ఫెడరేషన్కు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఎన్నికల్లో ఓటు హక్కును కోరుతూ అనేక అసంతృప్త, అనుబంధ రాష్ట్ర సంస్థలు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు చాలాసార్లు వాయిదా పడ్డాయి. చివరకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి కొత్త తేదీని ప్రకటించారు. కానీ, పోలింగ్కు ఒక రోజు ముందు హర్యానా రెజ్లింగ్ అసోసియేషన్ (హెచ్డబ్ల్యూఏ) పంజాబ్–హర్యానా హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. శుక్రవారం విచారణకు రానుంది.
నేడు, రేపు వరల్డ్ ట్రయల్స్ యాదాతథం
డబ్ల్యూఎఫ్ఐపై వేటు పడినప్పటికీ వరల్డ్ చాంపియన్షిప్స్ కోసం శుక్ర, శనివారాల్లో ఏర్పాటు చేసిన సెలక్షన్ ట్రయల్స్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఫెడరేషన్ అడ్హక్ కమిటీ చీఫ్ భూపేందర్ బజ్వా స్పష్టం చేశారు. పటియాలాలో అన్ని వెయిట్ కేటగిరీల్లో ట్రయల్స్ ఉంటాయని తెలిపారు. కాగా, ఫెడరేషన్లో వివాదాలు త్వరలోనే ముగిసి సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని అడ్హక్ కమిటీ మరో మెంబర్ ఆశాభావం వ్యక్తం చేశారు.