
జయశంకర్ భూపాలపల్లి/ మహదేవ్పూర్, వెలుగు : సరస్వతి పుష్కరాలతో త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. బుధవారం ఏడురోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా, సాయంత్రం గాలిదుమారంతో కురిసిన అకాలవర్షంతో కాళేశ్వరం ప్రాంగణం అంతా అతలకుతలమైంది. గాలివానకు టెంట్లు, చలువ పందిళ్లు, ఫ్లెక్సీబోర్డులు కూలిపోయాయి.
విద్యుత్ లైట్లు అమర్చిన స్టాండ్స్ పడిపోయాయి. పార్కింగ్ ప్లేస్లో నీళ్లు నిలిచి ప్రైవేట్ వెహికల్స్ అన్నీ బురదలో చిక్కుకున్నాయి. కలెక్టర్ రాహుల్ శర్మ స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీసర్లను, సిబ్బందిని అప్రమత్తం చేసి, పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రత్యేకంగా సింగరేణి రెస్క్యూ టీమ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.