అక్టోబర్ నెలలో 207 కోట్ల ట్రాన్సాక్షన్స్ నమోదు
న్యూఢిల్లీ: యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్షన్స్ సరికొత్త మైలురాయిని తాకాయి. అక్టోబర్ నెలలో 207 కోట్ల ట్రాన్సాక్షన్స్ నమోదైనట్టు తాజా డేటాలో వెల్లడైంది. ఈ ట్రాన్సాక్షన్స్ వాల్యూ రూ.3.3 లక్షల కోట్లుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) డేటా తెలిపింది. యూపీఐ ప్లాట్ఫామ్పై 189 బ్యాంక్లు లైవ్గా తమ సేవలందిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో రూ.3.29 లక్షల కోట్ల విలువైన 180 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. పర్సన్ నుంచి పర్సన్కు, పర్సన్ నుంచి మర్చెంట్కు మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయంలో యూపీఐ చాలా మార్పులు తీసుకొచ్చింది. సెక్యూర్గా ట్రాన్సాక్షన్స్ జరుపుకునేలా సహకరిస్తోంది. గతేడాది అక్టోబర్ నెలలో యూపీఐ లావాదేవీలు 100 కోట్ల మార్క్ను తాకాయి. 2017లో ఇది లాంచ్ అయినప్పటి నుంచి ప్రతి నెలా యూపీఐ లావాదేవీల వాల్యూమ్ పెరుగుతూ వస్తోంది. అయితే కరోనా అవుట్బ్రేక్తో దేశంలో లాక్డౌన్ విధించడంతో ఏప్రిల్–మేలలో యూపీఐ లావాదేవీలు కాస్త తగ్గాయి. జూన్ నుంచి మళ్లీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ రికవరీ సాధించాయి.