- ఫీచర్ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చిన భీమ్ యూపీఐ సర్వీసులు
ముంబై: క్యాష్లెస్ పేమెంట్ల కోసం వాడే భీమ్ యూనిఫైడ్పేమెంట్స్ ఇంటర్ఫేస్ ( యూపీఐ) సిస్టమ్ స్మార్ట్ఫోన్లతోపాటు ఫీచర్ ఫోన్లకూ అందుబాటులోకి వచ్చింది. మనదేశంలో దాదాపు 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకునేలా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ‘123 పే’ సర్వీసును ప్రారంభించారు. 2016లో స్మార్ట్ఫోన్ల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) యూపీఐని మొదలుపెట్టింది. ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం యూపీఐ యాక్సెస్ను ప్రారంభించడానికి యూఎస్ఎస్డీ కోడ్ను (*99#) ఉపయోగించాలి.
ఈ సర్వీస్ ఉచితం కాదని, అన్ని టెల్కోలలో పనిచేయకపోవచ్చని డిప్యూటీ గవర్నర్ టి. రవిశంకర్ తెలిపారు. వాడకం కూడా అంత ఈజీగా ఉండదని వివరించారు. ప్రస్తుతం యూపీఐలోని అన్ని ఫీచర్లు స్మార్ట్ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ‘‘ పేదలు, గ్రామీణులు స్మార్ట్ఫోన్లను వాడలేకపోతున్నారు. అందుకే ఫీచర్ఫోన్ల కోసం యూపీఐ 123 పేను మొదలుపెట్టాం. దీనివల్ల ఆన్లైన్ పేమెంట్లు మరింత పెరుగుతాయి. మరింత మందికి ఫైనాన్షియల్ సేవలు అందుబాటులోకి వస్తాయి’’ అని దాస్ తెలిపారు.
నాలుగు రకాలుగా యూపీఐని వాడొచ్చు
ఫీచర్ ఫోన్ యూజర్లు ఇప్పుడు నాలుగు రకాలుగా యూపీఐని ఉపయోగించుకోవచ్చు. ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) నంబర్కు కాల్ చేసి యూపీఐ ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఫీచర్ ఫోన్లలో యాప్ను ఉపయోగించుకొని యూపీఐని వాడొచ్చు. మిస్డ్ కాల్ ఆధారిత విధానాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రాక్సిమిటీ సౌండ్ ఆధారిత చెల్లింపు విధానమూ ఉంటుంది. ఇందుకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. ఈ నాలుగు పద్ధతుల ద్వారా ఫీచర్ఫోన్ యూజర్లు స్నేహితులకు, కుటుంబ సభ్యులకు డబ్బు చెల్లించవచ్చు. యుటిలిటీ బిల్లులు కట్టవవచ్చు. వెహికల్ ఫాస్ట్ ట్యాగ్లను రీఛార్జ్ చేయవచ్చు. మొబైల్ బిల్లులను చెల్లించవచ్చు. ఖాతా బ్యాలెన్స్లను చూసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాలను లింక్ చేయవచ్చు.
యూపీఐ పిన్లను మార్చవచ్చు. ప్రతి ఏటా యూపీఐ వాడకం వేగంగా పెరుగుతోంది.2021 ఫైనాన్షియల్ ఇయర్లో రూ.41 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు రికార్డు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు వీటి విలువ రూ.76 లక్షల కోట్లకు చేరుకుందని దాస్ చెప్పారు. యూపీఐ ద్వారా త్వరలోనే రూ. 100 లక్షల కోట్ల లావాదేవీల రికార్డును చేయవచ్చని దాస్ చెప్పారు. ఈ సందర్భంగా యూపీఐ యూజర్ల కోసం 24x7 హెల్ప్లైన్ను ప్రారంభించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) 'డిజిసాథి' పేరుతో దీనిని నిర్వహిస్తుంది. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి సాయం చేస్తుంది. యూజర్లు డిజిటల్ పేమెంట్స్ ఫిర్యాదుల కోసం www.digisaathi.infoని చూడవచ్చు లేదా ఫోన్ల నుండి 14431/ 1800 891 3333 నంబర్లకు కాల్ చేయవచ్చు.
ఇవి కూడా చదవండి
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్